టీటీడీ జేఈఓ ధర్మారెడ్డికి కొత్త తలనొప్పి: ఆయన పేరుతో దళారుల ధందా: పీఆర్వోలుగా చలామణి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారిగా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన ధర్మారెడ్డికి సరి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. తిరుమల కొండ నిండా దళారులు తిష్ట వేశారు. వారిని ఏరిపారేయడం తలకు మించిన పనిగా భావిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్ల పీఆర్వోలమని చెప్పుకొంటూ టీటీడీ కింది స్థాయి సిబ్బందిని బెదిరించి, మరీ తమ పని కానిచ్చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా కొత్త సంయుక్త కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి పేరును సైతం వాడుకోవడానికి దళారులు వెనుకాడట్లేదు. జేఈఓ పేషీలో పనిచేసే సిబ్బందితో స్నేహం కుదుర్చుకుని ఏకంగా ఆయన పేరుతోనే తమ ధందాను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.
జేఈఓ పేరు దుర్వినియోగం..
తిరుమలలో శ్రీవారి దర్శనం లేదా అద్దె గదుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కుటుంబ సభ్యులు లేదా బంధువుల కోసం సిఫారసు లేఖలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లేఖలను గౌరవిస్తూ వాటిని తెచ్చిన వారికి కోరిన కాటేజీలో గదులను కేటాయిస్తుంటారు. సులువుగా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కలుగజేస్తుంటారు. అలాంటి లేఖలను సంపాదించుకున్న కొందరు దళారులు పీఆర్వోల పేరుతో చలామణి అవుతున్నారు. తాము ఫలానా మంత్రి పీఆర్వోలమని, వ్యక్తిగత కార్యదర్శులమని చెప్పుకొని, లేఖలను దుర్వినియోగం చేస్తున్నారు. గదుల కేటాయింపు, స్వామి వారి దర్శనానికి రేటు మరీ భక్తుల నుంచి వేల రూపాయలను వసూలు చేస్తున్నారు.
కడప కుర్రాడు..తన పేరు మీద ఉన్న పార్సెల్ చూసి స్పృహ తప్పాడు!
ప్రముఖుల లెటర్ హెడ్లు..వాటిపై నకిలీ సంతకాలు
ప్రముఖుల సంతకాలను ముందుగానే లెటర్హెడ్లపై తీసుకుని, వాటిపై సంతకాలను సైతం ఫోర్జరీ చేస్తున్నారు. ఆయా లెటర్ హెడ్లపై తమకు పరిచయం ఉన్న వారి పేర్లను టైప్ చేయించి తిరుమలలో విఐపి దర్శన టికెట్లు, వసతి, ప్రసాదాలను పొందుతున్నారు పీఆర్వోలుగా చలామణి అవుతున్న దళారులు. వాటిని ఇష్టానుసారంగా, అధిక రేట్లకు భక్తులకు అమ్ముకుంటున్నారు. ఇలాంటి వారు తిరుమల కొండపై 200 నుంచి 250 మంది వరకు ఉండొచ్చని అంటున్నారు టీటీడీ కిందిస్థాయి సిబ్బంది. దీనిపై పక్కా సమాచారం ఉన్నప్పటికీ.. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం నిఘా ఉంచట్లేదనే ఆరోపణలు ఉన్నాయి.
నియంత్రణ సాధ్యమేనా?
ఈ వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత జేఈఓ కార్యాలయంపై ఉంది. స్వయంగా జేఈఓ పేషీకి చెందిన సిబ్బంది పేర్లను వాడుకుని మరీ తమ ధందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు కొందరు దళారులు. దీనివల్ల స్వామి వారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు.. క్యూలైన్లలో పడిగాపులు పడాల్సి వస్తోంది. వారి వద్ద కూడా సిఫారసు లేఖలు ఉన్నప్పటికీ.. ఎదురు చూపులు తప్పని పరిస్థితి ఏర్పడింది. పీఆర్వోలు అనే ట్యాగ్ తగిలించుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం కిందిస్థాయి సిబ్బంది వారిని నియంత్రించలేక నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గానీ, జేఈఓగా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన ధర్మారెడ్డి గానీ ఈ దుర్వ్యవస్థను ఎలా నియంత్రిస్తారనేది ఆసక్తికరంగా మారింది.