వివాదంలో సీఎం రమేష్... తిరుమలలో నిబంధనలు అతిక్రమించిన ఎంపీ..
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం(డిసెంబర్ 28) తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే చేతికి స్మార్ట్ వాచ్తో ఆయన ఆలయం లోపలికి ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా టీటీడీ నిబంధనల ప్రకారం భక్తులు ఎలక్ట్రానిక్ వస్తువులతో లోపలికి వెళ్లరాదు. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం దీన్ని నేరంగా పరిగణిస్తారు.
సీఎం రమేష్ చేతికి ఆపిల్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ ఉంది. ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దాన్ని గమనించకపోవడంతో ఆయన అలాగే ఆలయంలోకి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. అయితే ఆలయంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం అని తెలిసి కూడా సీఎం రమేష్ ఇలా నిబంధనలు అతిక్రమించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సీఎం రమేష్ దంపతులకు దైవ దర్శనం సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు,తీర్థప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల యూకె నుంచి భారత్ వచ్చిన కొందరికి కరోనా పాజిటివ్ రాగా, వారిలో కొత్త రకం వైరస్ లక్షణాలు బయటపడ్డాయన్నారు. ఈ క్రమంలో ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశమంతా బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయని... తిరుపతిలో జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని అన్నారు.కాగా,కొద్ది నెలల క్రితం సీఎం రమేష్ కరోనా వైరస్ బారినపడి ఆ తర్వాత కోలుకున్న సంగతి తెలిసిందే.
ఈ రోజు ఉదయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం జరిగింది.
— Dr. CM Ramesh (@CMRamesh_MP) December 28, 2020
ఆ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మా కుటుంబంతో పాటు ప్రజలందరికీ లభించాలని ప్రార్థించాను.
ఓం నమో వేంకటేశాయ 🙏 pic.twitter.com/TDqzMnFXIv