టీటీడీ నిధులపై బీజేపీ ఎంపీ సంచలనం: అయిదేళ్ల లెక్కలే టార్గెట్: ఏపీ హైకోర్టులో: కాగ్తో ఆడిట్
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు, దాతల నుంచి విరాళలు, కానుకల రూపంలో అందే నిధులు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ నిధులు దుర్వినియోగమౌతున్నాయని, పక్కదారి పడుతున్నాయంటూ ఇదివరకు వార్తలు వెలువడ్డాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఓ రాజకీయ సభను నిర్వహించడానికి 10 రూపాయల మేర టీటీడీ నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
టీటీడీ నిధుల దారి మళ్లింపుపై..
భారతీయ జనతా పార్టీ ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడానికి, కొత్త ఆలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల జీర్ణోద్ధారణ వంటి పనులకు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను వ్యయం చేయాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా తిరుమల శ్రీవారి ఆలయ నిధులను దారి మళ్లించారంటూ వచ్చిన ఆరోపణల వ్యక్తం అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
కాగ్ ద్వారా ఆడిట్..
టీటీడీ నిధులపై కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ద్వారా ఆడిట్ జరిపించాలనే డిమాండ్ లేవనెత్తారు. కాగ్ ద్వారా ఆడిట్ను జరిపించాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఆయన సన్నిహితుడు సత్యపాల్ సబర్వాల్ ఈ పిల్లో అసోసియేట్ అయ్యారు. అయిదేళ్లు, అంతకుమించిన కాలంలో తిరుమల నిధులపై కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలని కోరారు.
విరాట్ హిందూ సమ్మేళన్కు సమన్వయ బాధ్యతలు..
ఈ పిల్ బాధ్యతలను పర్యవేక్షించే బాధ్యతలను సుబ్రహ్మణ్య స్వామి విరాట్ హిందూ సమ్మేళన్ (వీహెచ్ఎస్)కు అప్పగించారు. హైకోర్టు అడిగిన సమాచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వీహెచ్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవింద్ హరి అందజేస్తారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. అయిదేళ్ల కాలంలో వ్యయం చేసిన టీటీడీ నిధులకు సంబంధించిన లెక్కలపైనే సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీ లెక్కలు దారి మళ్లాయంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు.
అయిదేళ్ల లెక్కలపైనే నిఘా..
శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని, కేంద్రం ఆధీనంలోకి తీసుకుని రావలనే డిమాండ్ను ఇదివరకే సుబ్రహ్మణ్య స్వామి లేవనెత్తారు. ఇక తాజాగా.. శ్రీవారి నిధుల దారిమళ్లింపు ఆరోపణలపై ఆయన దృష్టి సారించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏటా వందల కోట్ల రూపాయల మేర ఆదాయం అందుతుంటుంది. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు, హుండీ ఆదాయం, టికెట్లు, ప్రసాదాలను విక్రయించడం ద్వారా వచ్చే రాబడి కోట్ల రూపాయల మేర ఉంటుంది. ఈ మొత్తాన్ని ధర్మాక కార్యకలాపాల కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.
Recommended Video
రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లింపు..
సామాజిక బాధ్యత కింద ఆసుపత్రులు, విద్యా సంస్థల నిర్వహణకూ నిధులను కేటాయించే వీలు ఉంది టీటీడీకి. దీనికి భిన్నంగా రాజకీయ ప్రయోజనాల కోసం కూడా టీటీడీ నిధులను వినియోగించుకున్నరంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలని సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టును ఆశ్రయించారు. విరాట్ హిందూ సమ్మేళన్ నాయకులకు ఈ పిల్ బాధ్యతను అప్పగించారు. టీటీడీతో సమన్వయం చేసుకుంటూ ఈ టాస్క్ను పూర్తి చేయాల్సి ఉంటుందని తన ట్వీట్లో పేర్కొన్నారాయన.