తిరుమలలో కొత్త రూల్.. ఆ వాహనాలతో వెళ్తే అనుమతి లేదు
కరోనా లాక్డౌన్ తర్వాత తిరుమలకు వచ్చే భక్తులకు కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు ఆంక్షలు విధించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. కరోనా లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తులకు అనుమతిస్తున్నారు . అయితే కోవిడ్ నిబంధనలు మాత్రమే కాకుండా, వాహనాల విషయంలోనూ సరి కొత్త రూల్స్ ను తీసుకువచ్చారు అధికారులు. పదేళ్ల కాలపరిమితి దాటిన వాహనాలతో భక్తులు తిరుమలకు రావద్దని ఏఎస్పీ ముని రామయ్య తెలిపారు.
హెల్మెట్ పెట్టుకుంటారో లేకా లైసెన్స్ పోగొట్టుకుంటారో మీ ఇష్టం .. స్వీట్ వార్నింగ్
తిరుమల ఘాట్ రోడ్ అలిపిరి వద్ద వాహనాల కాలపరిమితిని పరిశీలించి మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నట్లుగా తెలిపారు. కాలపరిమితి దాటిన వాహనాలతో ప్రయాణించే క్రమంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఎవరూ కాలపరిమితి దాటిన వాహనాలతో తిరుమలకు రావద్దని,ఒకవేళ వస్తే అలిపిరి వద్ద ఆగిపోవాల్సి వస్తోందని, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. తిరుమలలో నో హారన్ జోన్ గా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు .
వాహనాల హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం జరిమానా విధిస్తామని ఏఎస్పీ ముని రామయ్య తెలిపారు. పాతవి , ఫిట్నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్ల పై నిషేధం విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2010 కంటే ముందు రిజిస్ట్రేషన్ వాహనాలను తిరుమలకు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. రెండవ ఘాట్ రోడ్డులోని శ్రీ వారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలుపుతున్నారు అని, అందు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ భక్తులు వాహనాలు నిలుపకుండా చర్యలు కూడా తీసుకుంటున్నామని ఏఎస్పి ముని రామయ్య వెల్లడించారు.