కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్ 14 వరకు తిరుమల శ్రీవారి దర్శనాలు లేవు
తిరుపతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ప్రభావం తిరుమల తిరుపతి దేవస్థానంపైనా పడింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ 14 వరకు తిరుమల శ్రీవారికి కేవలం నిత్య కైంకర్యాలను మాత్రమే నిర్వహిస్తామని, భక్తులను దర్శనానికి అనుమతించబోమని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది.
కాగా, రెండు కనుమ రహదారులను దేవస్థానం అధికారులను మూసివేశారు. టీటీడీ సిబ్బంది తిరుమలలో వారం రోజులపాటు షిఫ్ట్ పద్ధతిలో విధులు నిర్వహించనున్నారు. తిరుపతిలో 50 వేల మందికి దేవస్థానం తరపున ఆహారం పంపిణీ చేస్తున్నారు.
ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించాల్సిన శ్రీవారి హనుమంత సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. స్వామి వారి వార్షిక వసంతోత్సవాలను కూడా కళ్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
ఇది ఇలావుండగా, టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 25వ విడత మనగుడి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించతలపెట్టిన మార్చి 25న ఉగాది, ఏప్రిల్ 2న శ్రీరామనవమి వేడుకలను పరిపాలనా కారణాల వల్ల రద్దు చేయడమైనదని ఇప్పటికే ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వందలాది మంది అనుమానితులు క్వారైంటన్లో చికిత్స పొందుతున్నారు.