అన్యమత ప్రచారంపై సర్కార్ సీరియస్: మతాన్ని గుర్తించడానికి దేవాలయ ఉద్యోగుల ఇళ్లల్లో తనిఖీలు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంపై హిందూ వ్యతిరేక ముద్రను వేయడానికి రాజకీయ ప్రత్యర్థులు చేస్తోన్న ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. వైఎస్ జగన్ కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోన్న నేపథ్యంలో.. దీన్ని అడ్డుగా పెట్టుకుని ఆయన సారథ్యంలోని ప్రభుత్వంపై హిందూ వ్యతిరేక ముద్రను వేయడానికి తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ ఉమ్మడిగా వ్యూహాలు రచిస్తున్నాయని, ఇందులో భాగంగా- తిరుమలలో ఆర్టీసీ బస్ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. దీనిపై వైఎస్ జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారని, సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు మెడకు చుట్టుకుంటోన్న టీడీపీ అన్యమత ప్రచార పర్వం: తవ్వి తీస్తోన్న వైసీపీ
సమన్వయ కమిటీల ఏర్పాటుపై కసరత్తు
హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇదివరకే హెచ్చిరికలను జారీ చేశారు. దీనికి అనుగుణంగా.. అన్యమత ప్రచార కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేకంగా కొన్ని సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా కసరత్తు కూడా ఆరంభించినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రముఖ దేవాలయాలు, ధర్మాకి సంస్థల ఆధర్వర్యంలో నడిచే ప్రదేశాల్లో అన్యమత ప్రచారం జరగకుండా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం సమన్వయ కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
మతాన్ని గుర్తించడానికి దేవాలయ సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు
హిందువుల మనోభావాలను కించపరిచేలా ఎవ్వరు ప్రవర్తించినా ఉపేక్షించబోమని ఎల్వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని హైందవ దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు ఎవరైనా ఉంటే.. వారు స్వచ్ఛందంగా తమ విభాగాధిపతులకు రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాంటి వారిని గుర్తించడానికి అవసరమైతే- ఉద్యోగుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తామని ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అన్యమతానికి సంబంధించిన ప్రకటనలను ముద్రించిన టికెట్లను తిరుమల బస్సులో జారీ చేయడం వెనుక ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఉందని, దీనికి బాధ్యడిగా గుర్తించిన జగదీశ్ బాబు అనే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఇదే వివాదంలో మరి కొందరు ఆర్టీసీ అధికారులను విచారిస్తున్నామని, బాధ్యులుగా గుర్తించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.