సీసీటీవీ ఫుటేజీ ఉంటేనే దొంగలు దొరుకుతారా? గుడిలో లింగాలను కూడా మింగేయడమంటే ఇదే!
తిరుపతి: రాష్ట్రంలో సంచలనం రేపిన తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్సవ మూర్తుల కిరీటాల దొంగతనం కేసులో ఎలాంటి పురోగతీ కనిపించలేదు. సంఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీ లేక పోవడం ప్రధాన అడ్డంకిగా మారిందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కేసును తిరుపతి అర్బన్ శాంతి భద్రతల విభాగం పోలీసులు, తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం అధికారులు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా తిరుపతి అర్బన్ పోలీసులు మాత్రమే ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా.. దీనికి ఉన్న ప్రాముఖ్యతను వల్ల టీటీడీ విజిలెన్స్ విభాగం సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. దర్యాప్తులో అర్బన్ పోలీసులకు సహకరిస్తున్నారు. వారు అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు.
గుడే కాదు..లింగమూ స్వాహా
హైందవ సంప్రదాయంలో ఆలయాలకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో మాటల్లో చెప్పలేం. హైందవ సంప్రదాయాన్ని విశ్వసించే ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో ఆలయాలు, అధిక ప్రాధాన్యత ఉంది. పాపం చేస్తున్నామనే భయం వల్ల కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. కారణాలు ఏమైనప్పటికీ.. గుళ్లు, గోపురాలను సందర్శించడం, తాము కొలిచే స్వామి వారిని నిత్యం స్మరిస్తుంటారు. వారానికి ఒకసారయనా గుడికి వెళ్తుంటారు. పండుగలు, పబ్బాల సమయంలో ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. పైగా తిరుమలను సందర్శించడం అనేది కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉన్న అంశం. సప్తగిరులపై వెలిసిన తిరుమల పుణ్యక్షేత్రాన్ని సాక్షాత్తూ ఇల వైకుంఠంలా భావిస్తారు భక్తులు.
శ్రీ మహావిష్ణువే తిరుమలలో కొలువై ఉన్నాడనే భావన ప్రజల్లో ఉంది. తిరుమలను సందర్శించిన ప్రతి భక్తుడూ తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయాన్ని కూడా తప్పనిసరిగా సందర్శిస్తారు. గోవిందరాజస్వామిని శ్రీనివాసుడి సోదరుని కొలుస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. రోజూ కనీసం 50 నుంచి 70 వేల మంది గోవింద రాజస్వామి వారి ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అంత రద్దీగా ఉండే ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఉత్సవ మూర్తులకు అమర్చిన మూడు కిరీటాలను అపహరించారు. అటు సాధారణ పోలీసులు, ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగానికి సవాల్ విసిరారు. `గుడినే కాదు.. గుడిలో లింగాలను కూడా మింగేసే ఘనులు ఉన్నారు`.. అనే సామెతను నిజం చేశారు.
వేల సంఖ్యలో భక్తులు..అధ్వాన్నస్థితిలో సీసీటీవీ కెమెరాలు
గోవిందరాజ స్వామి ఆలయంలో సీసీటీవీ కెమెరాలు వారం రోజులుగా పని చేయట్లేదని సిబ్బంది చెబుతున్నారు. చాలా చోట్ల అమర్చిన కెమెరాలు కూడా పాతవేనట. రోజూ వేల సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలు పాతవి కావడం ఒక ఎత్తయితే.. చోరీ చోటు చేసుకున్న ఉప ఆలయ సమీపంలో అమర్చిన మరో కెమెరా వారం రోజులుగా పని చేయకపోవడం మరో ఎత్తు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఉన్న ధార్మిక సంస్థల్లో టీటీడీ ఒకటి. రద్దీ రోజుల్లో ఒక్కరోజులోనే ఎంత లేదనుకున్నా, కనీసం మూడు కోట్ల రూపాయాలను కళ్ల చూస్తుంది టీటీడీ. హుండీ రూపంలో, టికెట్లు, ప్రసాద విక్రయాలు, ఆర్జిత సేవల ద్వారా వచ్చే ఆదాయమే అదంతా. ఇంత భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తోన్న టీటీడీ.. కనీసం సీసీటీవీ కెమెరాలను కూడా మార్చుకోలేకపోయిందా? పని చేయని కెమెరాలను వాటి మానాన వాటికి వదిలేసిందా? పని చేయని కెమెరాల స్థానంలో కొత్తవాటిని అత్యాధునికమైన కెమెరాలను ఎందుకు అమర్చ లేక పోయింది? అనే ప్రశ్నలకు సమాధానాలు అనేకం.
రద్దీ సమయంలోనే చోరీ
ఏ ఆలయానికైనా ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. గోవిందరాజ స్వామి ఆలయంలో చోటు చేసుకున్న చోరీ ఘటన కూడా సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్యలోనేనని ఆలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. నిజానికి.. అది రద్దీ సమయం. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకునే సందర్భం. అదే సమయంలో.. ఆలయ అర్చకులు గానీ, ఇతర సిబ్బంది గానీ విధులను మారుతారు. ఆ సమయంలో చోరీ జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
సీసీటీవీ కెమెరాలే దిక్కా?
ఈ కేసు దర్యాప్తులో సీసీటీవీ కెమెరాలే పోలీసులకు పెద్ద దిక్కు అయ్యాయి. అవి లేకపోవడం వల్ల చేతులెత్తేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. సీసీటీవీలు, సీసీటీవీ ఫుటేజీలు, కెమెరాలు ఈ మధ్యకాలంలో వచ్చినవే. అవి లేనప్పుడు పోలీసులు.. ఇలాంటి చోరీ కేసులను ఛేదించలేకపోయారా? ఇప్పట్లా చేతులెత్తేయలేదే? అనే ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. సీసీటీవీ కెమెరాల ద్వారా లభించే సమాచారమే కీలకమని పోలీసులు చెబుతుండటం హాస్యాస్పదమనేది భక్తుల ఆవేదన.
కొత్తేమీ కాదు..అయినా కళ్లు తెరచుకోలేదు
గోవిందరాజ స్వామి ఆలయాన్ని దొంగలు టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా తిరుమలనే లక్ష్యంగా చేసుకుని చోరీ చేశారనే వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. శ్రీవారికి భక్తులు సమర్పించిన `పింక్ డైమండ్` చోరీకి గురైన ఘటనపై భిన్న వాదనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు దీన్ని మాయం చేశారని చెబుతున్నారు. ఒకసారి చోరీ జరిగిన తరువాత కూడా టీటీడీ కళ్లు తెరచుకోలేదు. మొద్దు నిద్రలోనే గడిపింది. తాజాగా చోటు చేసుకున్న కిరీటాల చోరీ.. దాని ఫలితమే.