తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
తిరుమల: తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. పవిత్రమైన శ్రీవారి ఆలయం ఎదురుగా పందుల మంద స్వేచ్ఛగా తిరుగాడింది. పదికి పైగా పందులు శ్రీవారి ఆలయం ముందుభాగంలో చాలాసేపటి వరకు చక్కర్లు కొట్టాయి. వాటిని అదిలించే వారు లేకపోవడంతో స్వేచ్ఛగా తిరిగాయి. దీని పట్ల భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మండిపడుతున్నారు. ఇదివరకు కూడా ఒకట్రెండుసార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ.. పెద్దగా పట్టించుకోవట్లేదని అంటున్నారు.
Recommended Video
ఈ తెల్లవారు జామున 2 నుంచి 3 గంటల మధ్యలో పందుల మంద తిరుమాడా వీధుల్లో కలియ తిరగడం కనిపించింది. కొందరు భక్తులు వాటిని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. సాధారణంగా పందులు కాటేజీల పరిసరాల్లో కనిపిస్తుంటాయి.
ఆహారం కోసం అవి దుకాణాలు, కాటేజీల వద్ద తిరుగాడుతుంటాయి. శ్రీవారి ఆలయ పరిసరాల్లోకి రాకుండా అక్కడి భధ్రతా సిబ్బంది కాపలాగా ఉంటారు. ఈ తెల్లవారు జామున పదికి పైగా పందుల గంపు తిరుమాడా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగాడాయి. శ్రీవారి ఆలయం ముందుభాగంలో కలియ తిరిగాయి.
శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఇటీవల పందుల సంచారం తీవ్రమైందనడానికి ఉదాహరణగా నిలిచాయి. ఆలయ ప్రాంగణంలోనికి తరచూ పందులు వరాహాలు సంచరిస్తున్నప్పటికీ.. వాటిని అరికట్టడానికి భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవట్లేదని భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆధ్యాత్మిక వాతావరణానికి, శుభ్రతకు మారుపేరుగా నిలిచే తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో ఇలాంటి ఘటనలు పదే పదే చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందులు సంచారానికి రాకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.