తిరుపతిలో షాకింగ్ - 236 కరోనా పేషెంట్లు మాయం - ఆందోళనలో అధికారులు...
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ తిరుపతి వైద్యారోగ్యశాఖ అధికారులకు ఓ షాకింగ్ న్యూస్ అందింది. నగరంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన 236 మంది గల్లంతయ్యారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వీరికి పాజిటివ్ గా నిర్ధారణ అియింది. ఆ తర్వాత వీరంతా తమ ఫోన్లను స్విచాఫ్ చేసేశారు.
తిరుపతిలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. ప్రతీ రోజూ నగరంలోనే పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు కరోనా పరీక్షల వేగం కూడా పెంచారు. తాజాగా నగరంలో భారీగా పరీక్షలు నిర్వహించారు. ఇందులో వందలాది కొత్త కేసులు తేలాయి. వీటిలో 236 మంది రోగులు పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత తమ ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు. దీంతో వీరి ఆచూకీ కోసం వైద్యారోగ్యశాఖ సిబ్బంది గాలింపు చేపట్టారు.
తాజా పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయిన పేషెంట్లలో ఈ 236 మంది ఫోన్లు స్విచాఫ్ కానీ రాంగ్ నంబర్లు కానీ, తప్పుడు అడ్రస్ లు కానీ ఇచ్చినట్లు వైద్యారోగ్యశాఖ పరిశీలనలో తేలింది. దీంతో అధికారులు పోలీసులకు వీరిపై ఫిర్యాదు చేశారు. అంటు వ్యాధుల వ్యాప్తి నిరోధక చట్టం కింద వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వీరి కోసం గాలింపు చేపట్టారు. వీరి ఆచూకీ త్వరగా లభించకపోతే వీరి నుంచి చాలా మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.