తిరుమల కంటైన్మెంట్ జోన్ లేనట్టే .. ప్రకటించిన కొద్దిసేపటికే పొరబాటుగా అంటూ.. భక్తులకు ఊరట
శ్రీవారు కొలువైన పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. టీటీడీ అధికారులకు సైతం కరోనా భయం పట్టుకుంది. 80 మంది టిటిడి సిబ్బందికి కరోనా పాజిటివ్ నమోదయింది. దీంతో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. తిరుమల కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడంతో స్వామివారి దర్శనాలపై భక్తులకు ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్ గా ఉంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కష్టమే అన్న భావన వ్యక్తమైంది.
అయితే తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన కొద్ది సేపటికే పొరపాటున కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని చెబుతూ జిల్లా కలెక్టర్ మరో లిస్ట్ ను విడుదల చేశారు. మధ్యాహ్నం 2:30 కు తిరుమలను కంటైన్మెంట్ జోన్ అని ప్రకటించిన అధికారులు, ఆ తర్వాత గంటకు వెనక్కు తగ్గారు. అలాంటిదేమీ లేదని పొరపాటున ప్రకటించామని పేర్కొన్నారు. తాజా ప్రకటనతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల దర్శనాలకు ఆటంకం తొలగిపోయింది. భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఇప్పటికే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో దర్శనాలకు టీటీడీ అనుమతిస్తోంది. ప్రస్తుతానికి రోజుకు 10 వేల మంది స్వామిని దర్శించుకున్నారు. కరోనా కట్టడి నేపథ్యంలో కావలసిన అన్ని చర్యలను టీటీడీ తీసుకుంటోంది. మరోపక్క టీటీడీ సిబ్బందికి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్పష్టంచేస్తున్నారు. గతంలో విజయవాడలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన అధికారులు, ఆ తర్వాత కొద్ది సేపటికే లాక్ డౌన్ ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇప్పుడు కూడా తిరుమలలో కంటైన్మెంట్ జోన్ ప్రకటించి ఒక గంటలో ఉపసంహరించుకోవటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది .