ప్రాణవాయువు రాక ఆలస్యం.. అల్లాడిన 13 మంది రోగులు... ఎక్కడ అంటే...
కరోనా సోకి లంగ్స్ ఇన్ ఫెక్షన్ గురవుతున్నారు. అలా చాలా మందిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. దీంతో సర్కార్ దవాఖానల్లో ప్రాణవాయువు కొరత ఉంది. ఆక్సిజన్ ఉంటే బెడ్స్ ఉండవు.. బెడ్స్ ఉంటే ఆక్సిజన్ ఉండవు. అలా తిరుపతి రుయాలో కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత మాత్రం పరిస్థితి తగ్గుముఖం పట్టింది.
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కాసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో బాధితుల కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు సైతం ఆందోళనకు గురయ్యారు. సమయానికి ఆక్సిజన్ ట్యాంకర్ చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఐసీయూలో 13 మంది చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ నిలిచిపోవడంతో వీరంతా ఊపిరాడక అల్లాడిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు సీపీఆర్ విధానంలో శ్వాస అందించారు.
బాధితుల బంధువులు పక్కనే ఉండి అట్టముక్కలతో గాలిని విసిరారు. దాదాపు 25 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని సమాచారం. ఆక్సిజన్ ట్యాంకర్ రాగానే సాంకేతిక నిపుణులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించారు. ట్యాంకర్ సకాలంలో చేరకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు.
పేద వారు మాత్రం సర్కార్ దవాఖానాల వైపు మొగ్గు చూపుతారు. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందజేసే స్తోమత వారికి లేదు. ఇక ప్రైవేట్ ఆస్పత్రి జోలికి వెళితే అంతే సంగతులు. వేల రూపాయలు ముక్కు పిండి మరీ వసూల్ చేస్తారు. నా నీ.. తరతమ భేదం చూపించడం లేదు. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు చేతిలో డబ్బులు లేకున్నా.. అప్పు చేసి మరీ ఎలాగోలా చికిత్స అందిస్తున్నారు.