అంబులెన్స్ మాఫియా.. తిరుపతిలో దారుణం.. చివరి చూపు కూడా దక్కకుండా..
తిరుపతిలో దారుణం జరిగింది. రుయా ఆసుపత్రిలో అంబులెన్స్ మాఫియా ఆగడాలకు ఓ పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రైవేటు అంబులెన్సులో పేషెంట్ను తీసుకెళ్తున్నారని అక్కడి అంబులెన్స్ నిర్వాహకులు అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగింది.
మదర్స్ డే రోజు ఆ తల్లికి అపూర్వ కానుక.. ఆశలు వదిలేసుకున్న 32 ఏళ్ల తర్వాత..
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని రొంపిచర్లకు చెందిన వెంకటప్ప అనే వ్యక్తి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై రుయా ఆసుపత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో వెంకటప్ప ఇక బతకడం కష్టమేనని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తిరిగి వెంకటప్పను స్వగ్రామానికి తీసుకెళ్లాలనుకున్నారు. కనీసం అలాగైనా బంధువులను వెంకటప్ప చివరి చూపు చూసుకుంటాడని భావించారు. కానీ రుయా ఆసుపత్రి అంబులెన్స్ మాఫియా నిర్వాకంతో అంతా తలకిందులైంది.
వెంకటప్పను రొంపిచర్లకు తరలించేందుకు రుయా ఆసుపత్రిలోని అంబులెన్సును మాట్లాడగా.. రూ.8500 డిమాండ్ చేశారు. అంత డబ్బు తమవల్ల కాదని చెప్పారు. ఆన్లైన్లో రూ.3500కి వేరే అంబులెన్సును మాట్లాడుకున్నారు. ఆ అంబులెన్సు మంగళవారం(మే 19) ఉదయం రుయా ఆసుపత్రి ఆవరణలోకి వచ్చింది. ఆ సమయంలో వెంకటప్పను అందులో ఎక్కిస్తుండగా అక్కడి అంబులెన్సు నిర్వాహకులు అడ్డుకున్నారు. ఆ అంబులెన్స్ తాళాలను లాక్కున్నారు. తమను కాదని వేరే అంబులెన్స్ ఎలా మాట్లాడుకుంటారని వాగ్వాదానికి దిగారు.
దాదాపు 40 నిమిషాల పాటు ఈ ఘర్షణ కొనసాగింది. అంబులెన్స్ మాఫియా తాళాలు లాక్కోవడంతో.. వెంకటప్పకు ఆక్సిజన్ అందక అతను అందులోనే కన్నుమూశాడు. దీంతో ప్రాణం ఉండగా చివరిసారి తనవాళ్లను మళ్లీ చూసుకుంటాడన్న తమ ఆశ నెరవేరలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్పై కూడా వారు భౌతిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపించారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఈ గొడవ సద్దుమణిగింది. దీనిపై ఆసుపత్రి సూపరింటెండ్కి కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రుయా ఆసుపత్రిలో చాలాకాలంగా అంబులెన్స్ మాఫియా కొనసాగుతోందని.. చెప్పినంత ఇవ్వకపోతే దాడులకు దిగడం వారికి అలవాటేనని పలువురు ఆరోపిస్తున్నారు.