తిరుమల కొండపై చక్కర్లు కొడుతున్న విమానం..అపచారం అంటున్న భక్తగణం..
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టటం అపచారంగా భావిస్తున్నారు భక్తులు . గత మూడు రోజులుగా ఓ విమానం చక్కర్లు కొట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. అయితే ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై రాకపోకలపై నిషిద్ధం ఉంది. కానీ విమానం ఈ విధంగా తిరగటంపై టీటీడీ అధికారులు సైతం చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు ఫిర్యాదు చేశారు.
ఆలయంపై విమానం చక్కర్లు ... అపచారం అంటున్న భక్తులు
తిరుమల కొండపై అపచారం జరిగింది. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కొండపై ఓ విమానం తిరగటం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది . ఆ ప్రదేశం నో ఫ్లైయింగ్ జోన్ కింద ఉన్నప్పటికీ రెండు రోజులుగా ఓ విమానం అక్కడక్కడే చక్కర్లు కొడుతున్నట్టు గుర్తించారు అధికారులు . అది కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా ఛార్టెర్డ్ విమానమని గుర్తించిన టీటీడీ అధికారులు చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు ఫిర్యాదు చేశారు.
ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు ఆలయం పైనుండి వెళ్ళకూడదనే నియమం
తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయ గోపురంపై ఉన్న శ్రీవారి విమాన వేంకటేశ్వరస్వామికి ఎగువన విమానాలు వెళ్లకూడదనే నియమం ఉంది. అంతే కాదు తిరుమల కొండపై దేవతలు విహరిస్తుంటారని, అందుకే అక్కడ విమానాలు తిరిగితే అపచారమనే భావన కూడా ఉంది . అలాగే సైన్స్ ప్రకారం కూడా ఆ ప్రాంతంలో పాజిటివ్ రేస్ ఎక్కువగా ఉండటం వలన విమానాలు తిరిగితే అవి పేలిపోతాయనే ప్రచారం కూడా ఉంది . బ్రిటీష్ కాలంలో ఇలా రెండు విమానాలు ఈ ప్రాంతంలో పేలినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.
కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా ఛార్టెర్డ్ విమానం.. టీటీడీ ఫిర్యాదు
దేశ భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఐదేళ్లకోసారి విమానాల ద్వారా ఎస్వోఐ సర్వే చేయించే విషయం తెలిసిందే. అందులో భాగంగానే కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా ఛార్టెర్డ్ విమానం శ్రీవారి ఆలయంపై తిరుగుతుంది. ఆలయంపై విమానాల రాకపోకలు నిషిద్దం అని ఉన్నా అప్పుడప్పుడు కొండపై విమానాలు చక్కర్లు కొడుతుంటాయి. దీంతో వీటిపై గతంలోనూ టీటీడీ అధికారులు ఏవియేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. ఇక తాజాగానూ తిరుమల ఆలయంపై తిరుగుతున్న విమానంపై కూడా ఫిర్యాదు చేశారు.