ప్లాస్టిక్ రహితంగా తిరుమల: లడ్డూ రేటును మించిపోయిన సంచుల ధర
తిరుమల: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు ముందుకు వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టారు. తిరుమలకు వచ్చే భక్తులు కొనుగోలు చేసే లడ్డూ, ఇతర ప్రసాదాల కోసం జ్యూట్ బ్యాగులను వినియోగంలోకి తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం దీన్ని లాంఛనంగా ప్రారంభించారు అధికారులు. ప్లాస్టిక్ కవర్ల బదులుగా జ్యూట్ బ్యాగుల్లో లడ్డూలను భక్తులకు అందజేస్తున్నారు. ఈ బ్యాగులను సెంట్రల్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరఫరా చేస్తోంది. లడ్డూ ధర కంటే జ్యూట్ బ్యాగు రేటు ఎక్కవ ఉండటం భక్తులు నిరాశకు గురవుతున్నారు. ఈ జ్యూట్ బ్యాగు కోసం పెట్టే ధరలో ఇంకో లడ్డూను అదనంగా కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.
రూ.కోటి 17 లక్షల పాత నోట్లు: బ్యాంకులో ఎందుకు జమ చేయకూడదు: కేంద్రానికి నోటీసులు
ఒక్కో జ్యూట్ బ్యాగు ధర 25 రూపాయలుగా నిర్దారించారు. దీనికంటే ఇంకాస్త పెద్ద సైజు బ్యాగు ధర 30 రూపాయలు. ఇలా నాలుగు రకాల సైజుల్లో జ్యూట్ బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటి ధరలను 25, 30, 40, 55 రూపాయలుగా నిర్దారించారు. అధిక లడ్డూలను తీసుకెళ్లడానికి వీలుగా జ్యూట్ బ్యాగులను వివిధ సైజుల్లో విక్రయిస్తున్నామని టీటీడీ సిబ్బంది చెబుతున్నారు.
బ్యాగుల ధరలు అధికంగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. వాటిని కొనటం కంటే లడ్డూలను తీసుకెళ్లడానికి తామే ఏదైనా ప్రత్యామ్నాయ వస్తువును తెచ్చుకోవడం మేలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలనే నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామమే అయినప్పటికీ.. జ్యూట్ బ్యాగుల రేట్లను తగ్గిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.