నేడు ఏపి కి రాహుల్..! హోదా పట్ల భరోసా ఇవ్వనున్న కాంగ్రెస్ చీఫ్..!!
తిరుపతి/హైదరాబాద్ : ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరో సారి ఏపి లో పర్యటించబోతున్నారు. రాహుల్గాంధీ శుక్రవారం తిరుపతిలో నిర్వహించనున్న 'ఏపీ ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర' బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని గత ఎన్నికల్లో తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ హామీలిచ్చిన విషయం తెలిసిందే. అదే మైదానంలో శుక్రవారం బహిరంగ సభ జరగనుంది. హోదాపై ఎన్డీయే మాటమార్చిన వైనాన్ని రాహుల్ ఎండగట్టడంతో పాటు, తమ పార్టీ వైఖరిని వెల్లడించనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
శుక్రవారం ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి రేణిగుంటకు రాహుల్గాంధీ చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకొని తిరిగి తిరుపతికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి బాలాజీకాలనీ కూడలికి చేరుకొని.. మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పిస్తారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కలిసి భరోసా యాత్ర బస్సులో తారకరామ మైదానానికి చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు సభలో ప్రసంగించనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్తారు. కాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. కేంద్ర బలగాలు ఇప్పటికే తారకరామ స్టేడియాన్ని ఆధీనంలోని తీసుకున్నాయి.