TTD: బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు: జగన్ పై సంచలన వ్యాఖ్యలు..ఆయన కోసం ప్రార్థిస్తా..!
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఏవీ రమణ దీక్షితులు రీ ఎంట్రీ ఇచ్చారు. ఆగమ సలహాదారునిగా ఆయన బుధవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. గురువారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. పదవీ విరమణ చేసిన తరువాత రమణ దీక్షితులు శ్రీవారిని దర్శించుకోబోతుండటం ఇదే తొలిసారి. ఆగమ సలహాదారుని హోదాలో ఆయన స్వామివారిని దర్శించుకుంటారని టీటీడీ అధికార వర్గాలు తెలిపాయి. బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని..
రాజు మంచివాడైతే ప్రకృతి సహకరిస్తుందనే విషయం చరిత్రలో విన్నామని, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాలు, ఆచార వ్యవహారాలను సక్రమంగా పాటిస్తూ ప్రజల మేలు కోరే పాలకుల సంరక్షణలో ఆ రాజ్యంగానీ, ప్రాంతంగానీ సుభిక్షంగా ఉంటుందని పురాణాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ సమాజానికి ఎలాంటి హామీలు ఇచ్చారో.. వాటి కంటే ఎక్కువే అమలు చేస్తున్నారని చెప్పారు.
నాడు వైఎస్సార్.. నేడు జగన్
సమాజం బాగుండాలని కోరుకునే వారిలో అర్చకులు ముందుంటారని, ఆ కోరికతోనే వారు నిత్యం ఆలయాల్లో పూజలు చేస్తుంటారని రమణ దీక్షితులు చెప్పారు. రాష్ట్రం, దేశ క్షేమం కోసం దేవుళ్లకు పూజలు చేసే అర్చకుల కష్టాలను గుర్తించి, వారి కోసం ఏదో చేయాలనే తపన ఇదివరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో కనిపించిందని, ఇప్పుడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోందని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి ఆదాయమూ లేని ఆలయాల అర్చకుల సంక్షేమానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ప్రవేశ పెట్టి, సమర్థవంతంగా అమలు చేశారని అన్నారు.
మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా..
అర్చకులకు పదవీ విరమణ నిబంధనను అమలు చేయడం అత్యంత దారుణమని రమణ దీక్షితులు అన్నారు. అలాంటి నిబంధనను తొలగించి, వంశపారంపర్యంగా వస్తోన్న అర్చక వృత్తిని వైఎస్ జగన్ పునరుద్ధరించారని, ఫలితంగా వేలాది అర్చక కుటుంబాలకు మేలు కలిగించారని అన్నారు. మరో 30 సంవత్సరాలు పాటు వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రతి ఒక్క అర్చకుడు కోరుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి క్షేమం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన ధార్మిక కార్యక్రమాలతోనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు.
వారం రోజుల్లో ఆలయ ప్రధాన అర్చకుడిగా..
మరో వారం రోజుల్లో తాను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలను స్వీకరిస్తానని రమణ దీక్షితులు చెప్పారు. ప్రస్తుతం ఆయనపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన బలవంతంగా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. ఆ కేసును వెనక్కి తీసుకుంటానని రమణ దీక్షితులు ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయనపై ఎలాంటి కేసు లేకపోతే.. ఆలయ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలను కూడా స్వీకరించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.