శ్రీవారి దర్శనం కోసం వచ్చి... తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతి...
శ్రీవారి దర్శనం కోసం వచ్చి తిరుమలలో చిక్కుకుపోయిన ఓ రష్యన్ యువతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అసలే కరోనా లాక్ డౌన్... ఆపై చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. దీంతో స్వదేశానికి ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ దినపత్రిక ఆమె పరిస్థితిని వెలుగులోకి తీసుకురావడంతో పలువురు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ఎస్తర్ అనే యువతి కొన్ని నెలల క్రితం తల్లి ఒలివియాతో కలిసి భారత్ వచ్చారు. ఆమె తల్లి ఉత్తర భారతదేశంలోని బృందావనంలో ఉండగా... ఎస్తర్ తిరుమల దర్శనం కోసం వచ్చారు. సరిగ్గా అదే సమయంలో కరోనా లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయారు. కొన్నాళ్లకు చేతిలోని డబ్బు అయిపోయింది. దీంతో ఏం చేయాలో,ఎవరిని కలవాలో తెలియక సతమతమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ దినపత్రిక ద్వారా ఆమె పరిస్థితి గురించి వెలుగులోకి రావడంతో... తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆమెతో మాట్లాడారు.తన పీఏ ద్వారా రూ.10 వేలు తక్షణ ఆర్థిక సాయం అందించారు. బృందావనంలో ఉన్న ఆమె తల్లిని తిరుపతి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Recommended Video
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ కూడా స్థానిక బీజేపీ నేతలను పంపించి ఆమెతో మాట్లాడించారు. ఆమెకు అవసరమైన సాయం అందిస్తామని వాళ్లు భరోసా ఇచ్చారు. ఇక హైదరాబాద్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అధిపతి సతీశ్ ఎస్తర్కు రూ.25 వేలు ఆర్థిక సాయం అందించారు. తిరుపతికి చెందిన ఏపీ ట్రాన్స్ కో అధికారి ఒకరు రూ.10 వేలు అందజేశారు.