Sarileru Neekevvaru: తిరుమలలో మహేష్బాబు: కుటుంబంతో కలిసి.. చిత్రం యూనిట్ కూడా..!
Recommended Video
తిరుపతి: టాలీవుడ్లో తాజాగా సంచలనం సృష్టిస్తోన్న మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయిదు రోజుల వ్యవధిలోనే వంద కోట్ల క్లబ్లోకి చేరింది. విడుదలైన అన్ని చోట్లా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఈ మూడూ మహేష్బాబుకు బ్యాక్ అండ్ బ్యాక్ సూపర్ హిట్లను అందించాయి. ఈ మూడు సినిమాలూ వంద కోట్ల క్లబ్లో చేరాయి.
ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. చిత్రం యూనిట్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. హీరో మహేష్బాబు కుటుంబంతో సహా తిరుమలకు చేరుకున్నారు. మహేష్బాబు, ఆయన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితార శుక్రవారం తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Video: తిరుమలలో మహేష్బాబు: కుటుంబంతో కలిసి#MaheshBabu #SarileruNeekevvaru pic.twitter.com/1zFJyflYUD
— Oneindia Telugu (@oneindiatelugu) January 17, 2020
మహేష్బాబు కుటుంబంతో పాటు సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి, నటీనటులు విజయశాంతి, రాజేంద్రప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ సక్సెస్ కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
గురువారం రాత్రికే చిత్రం యూనిట్ సభ్యులు తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శన్ సందర్భంగా యూనిట్ సభ్యులంతా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెలుపలికి వచ్చిన అనంతరం మహేష్బాబును చూడటానికి భక్తులు ఎగబడ్డారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు.