మరి కొన్ని గంటల్లో మూతపడనున్న తిరుమల శ్రీవారి ఆలయం.. !
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల శ్రీవారి ఆలయం మరి కొన్ని గంటల్లో మూత పడబోతోంది. రాత్రి 11 గంటలకు ఆలయ తలుపులను మూసివేయనున్నారు అర్చకులు. గురువారం సూర్య గ్రహణాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రహణ కాలం ఆరంభానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయడం సంప్రదాయంగా వస్తోంది. తిరుమల సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాలను కూడా మూసివేయనున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయం ఇందుకు మినహాయింపు.
సూర్యగ్రహణం కారణంగా 13 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇదివరకే వెల్లడించింది. బుధవారం రాత్రి 11 గంటల నుంచి 13 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తామని తెలిపింది. గ్రహణం ముగిసిన అనంతరం సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించిన ఆలయం తలుపులను తెరుస్తారు. భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు. ఆలయం మూసివేతను దృష్టిలో ఉంచుకుని గురువారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది.
శ్రీవారి ఆలయంతో పాటు అన్న ప్రసాద సేవలను కూడా నిలిపి వేయనున్నారు టీటీడీ అధికారులు. వెంగమాంబ అన్న ప్రసాదం సహా శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల క్యాంటీన్, పద్మావతి విశ్రాంతి భవనం క్యాంటీన్, శ్రీనివాసం, విష్ణు నివాసం భక్తుల నివాస భవనాల్లోని శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రాలు, శ్రీ గోవిందరాజస్వామివారి సత్రాలు, టీటీడీ అనుబంధ ఆసుపత్రులు, తిరుచానూరులోని శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాద భవనములలో అన్న ప్రసాద వితరణ ఉండదని స్పష్టం చేశారు. గ్రహణ కాలం ముగిసిన అనంతరం వంటశాలలను శుద్ధి చేసి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది.
గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి గుడి, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం, సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం.. ఇవన్నీ మూత పడనున్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మాత్రం దీనికి మినహాయింపు. గ్రహణ కాలంలోనూ ఈ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. రాహు, కేతు సహిత దేవస్థానం కావడం వల్ల దీనికి మినహాయింపు ఉంది.