తిరుపతి: పైలట్ అప్రమత్తతో స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
చిత్తూరు: తిరుపతి విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతికి వచ్చిన స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
అయితే, అప్పటికే అప్రమత్తమైన విమాన పైలట్.. సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే విమానానికి మరమ్మతులు చేపట్టారు.
టైరు పేలిపోయిన కారణంగా స్పైస్ జెట్ విమానం ఆలస్యంగా బయల్దేరింది. కాగా, టైర్లలో గాలి తక్కువగా ఉండటం వల్లే గురువారం సాయంత్రం కూడా ఇదే తరహాలో స్పైస్ జెట్ విమానంలో సాంకేతికత లోపించింది. ఏం జరుగుతుందో తెలియక విమాన ప్రయాణికులు ఆందోళన చెందారు.
తిరుపతిలో మద్య నిషేధం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై వున్న తిరుపతిలో మద్యపాన నిషేధంపై గత పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో అధికారులు పలు మార్పులు చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రధాన కూడళ్లతోపాటు భక్తులు తిరుమలకు వెళ్లే ప్రధాన మార్గాల్లో మాత్రమే మద్యపాన నిషేధం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
తిరుపతి వ్యాప్తంగా మద్యనిషేధం చేయాలని అనుకున్నప్పటికీ.. తాజాగా ఈ మేరకు యోచిస్తునట్లు తెలుస్తోంది. దీనిపై పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.