ఆన్లైన్లో శ్రీవారి కల్యాణోత్సవం.. రేపటినుంచి టికెట్లు అందుబాటులోకి...
కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవాన్ని ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అగస్టు 6వ తేదీ నుంచి ఆన్లైన్లో భక్తులకు టికెట్లు అందుబాటులో ఉంచనుంది.
ఆగస్టు 7 నుంచి 31వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. టికెట్లు కావాల్సిన భక్తులు టీటీడి వెబ్సైట్లో (www.tirupatibalaji.ap.gov.in) తమ వివరాలు పొందుపరచి, రూ.1000 చెల్లించడం ద్వారా ఆన్లైన్ రశీదు పొందవచ్చు. శ్రీవారి ప్రసాదాలను పోస్టల్ శాఖ ద్వారా టిటిడి ఉచితంగా అందిస్తుంది.
ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తుల పేర్లు, గోత్ర నామాల ప్రతిని అర్చకులు స్వామివారి మూల విరాట్టు పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించనున్నారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరియం, రవిక, అక్షింతలు ప్రసాదంగా పోస్టల్ శాఖ ద్వారా పంపిస్తారు. స్వామివారి కల్యాణోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 12. గంటలకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
ఆన్లైన్ టికెట్లు ఇలా బుక్ చేసుకోవాలి....
మొదట www.tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్కు లాగిన్ అవ్వాలి.
ఆన్లైన్లో కల్యాణోత్సవం (ఆన్లైన్ పార్టిసిపేషన్) అనే ఆప్షన్ని ఎంచుకోవాలి.
ఇక్కడ టిటిడి పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తూ I Agree అనే బాక్స్లో టిక్ మార్క్ పెట్టాలి.
కల్యాణోత్సవం తేదీని, గృహస్తుల(ఇద్దరు) పేర్లు, వయసు, లింగం, గోత్రం, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ప్రసాదాలు పంపాల్సిన చిరునామా వివరాలు పొందుపరచాలి.
పొందుపరిచిన వివరాలు సరిచూసుకుని కంటిన్యూ ఆప్షన్ ఎంచుకోవాలి.
దైనా బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాకింగ్ ద్వారా టికెట్ మొత్తాన్ని చెల్లించవచ్చు.
పేమెంట్ పూర్తయిన అనంతరం టికెట్ ఖరారవుతుంది.