జగన్ శారదాపీఠం వెళితే లైవ్.. అయోధ్యను మాత్రం వదిలేస్తారా ? ఎస్వీబీసీపై బీజేపీ ఫైర్...
అయోధ్యలో చారిత్రక రామమందిరం నిర్మాణానికి నిన్న ప్రధాని మోడీ సహా పలువురు వీఐపీలు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని దాదాపు 250 టీవీ ఛానళ్లు గంటపాటు ప్రత్యక్ష్య ప్రసారం చేశాయి. కానీ టీటీడీకి చెందిన ఎస్వీబీసీ మాత్రం లైవ్ ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఆసక్తిగా తిలకించిన ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఎందుకు వదిలేసింది. ఎస్వీబీసీ ఛానల్ ఉద్దేశపూర్వకంగానే దీన్ని విస్మరించిందా అన్న అనుమానాలు తలెత్తున్నాయి.
టీటీడీకి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూసే బీజీపీ మాత్రం దీన్ని ఎందుకు వదిలిపెడుతుంది. ఇప్పుడు అదే విషయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది.అయోధ్య రామమందిరం భూమిపూజను టీటీడీ ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ప్రసారాలను తిరుమల భక్తి ఛానల్లో ఎందుకు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు. 250 టీవీ ఛానళ్లు అయ్యోధ్య రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారాన్ని గంటల పాటు ఇస్తే టీటీడీ ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు.
ముఖ్యమంత్రి వెళ్లిన శారదాపీఠం విశాఖలో ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీటీడీ అయోధ్య ప్రసారాలు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. 24 గంటలలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి... తక్షణం స్పందించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోందని విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు.