రూ.10 కోట్ల విలువైన వాల్ క్లాక్లు పంచుతున్న చెవిరెడ్డి: ఈసీకి టీడీపీ, రూ.5వేలు అడగమన్న జగన్పై ఫైర్
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిపై తెలుగుదేశం పార్టీ బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయన పెద్ద ఎత్తున గడియారాలను (వాల్ క్లాక్-గోడ గడియారాలు) నియోజకవర్గంలో పంచుతున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఒక్కో గడియారానికి రూ.వెయ్యి చొప్పున ఖర్చు చేశారని, మొత్తంగా లక్ష గడియారాలను నియోజకవర్గంలో పంచి పెడుతున్నారని ఆరోపించారు.
తుడా చైర్మన్ ఫిర్యాదు
ఈ మేరకు తుడా చైర్మన్ నర్సింహ యాదవ్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చెవిరెడ్డి ఓటర్లను ప్రలోభాలకుగురి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.10 కోట్ల విలువైన లక్ష గడియారాలను చెవిరెడ్డి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఎన్నికల అధికారులకు సమర్పించినట్లు నర్సింహ యాదవ్ తెలిపారు.
రూ.5వేలు తీసుకోవాలన్న జగన్ పైన ఆగ్రహం
దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల తిరుపతి సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మాట్లాడుతూ... ఓటుకు రూ.5వేలు అడగాలని ప్రజలకు సూచించారని, జగన్పై కూడా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటు అమ్ముకోవాలని చెప్పే జగన్పై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందన్నారు.
చదువులేని వ్యక్తి, ఐఏఎస్లను ఎలా కంట్రోల్ చేస్తారు: పవన్ కళ్యాణ్పై శివాజీ తీవ్రవ్యాఖ్యలు
సరైన ట్యాక్స్ బిల్లులు లేవు
వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలన్నారు. వైసీపీ నేతలు అవినీతి సొమ్ము కూడబెట్టి ఒక్కో నియోజకవర్గంలో రూ.20 కోట్లు నుంచి రూ.30 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని నర్సింహ యాదవ్ అన్నారు. ఎన్నికల సంఘం వీరిపై నిఘాపెట్టాలన్నారు. చెవిరెడ్డి పంచుతున్న గడియారాలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాలని డిమాండ్ చేశారు. ఈ గడియారాలు కొనుగోలుకు సంబంధించి వారి వద్ద సరైన ట్యాక్స్ బిల్లులు, సరైన ఇన్కం ట్యాక్స్ బిల్లులు లేవని చెప్పారు.