కుర్రో కుర్రో..చంద్రబాబు పలుకు: చూపుడు వేలితో చేయరాని నేరం: కోయదొర వేషంలో టీడీపీ నేత
తిరుపతి: డాక్టర్ ఎన్ శివప్రసాద్.. చిత్తూరు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నేత. ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు, వారి నుంచి వినిపించే డిమాండ్లను విభిన్న వేషధారణతో దేశ ప్రజలకు తెలియజేసిన ఏకైక నాయకుడు. సమస్యలకు అనుగుణంగా ఆయన వేషాలను ధరించే వారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లేవాు. తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు జిల్లా ఎంపీగా పలుమార్లు ఎన్నికైన ఆయన రెండేళ్ల కిందట కన్నుమూశారు. ఆ తరువాత.. ఆ స్థాయిలో వేషధారణ చేసే వారు ఇక రాలేకపోవచ్చనే అనుకున్నారు జిల్లా నేతలు.
మామ తరహాలో వినూత్న వేషధారణలో..
తాజాగా- ఆయన అల్లుడు పంతంగాని నరసింహ ప్రసాద్.. మామ అడుగు జాడల్లో నడుస్తున్నారు. ఆయనలాగే వేషభాషలను మార్చుకుంటున్నారు. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం చేస్తోన్నారు. మామలాగే కోయదొర వేషంలో వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తోన్నారు. ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాతకాన్ని చూస్తున్నారు. జోస్యం చెబుతున్నారు. రెండేళ్ల కిందట చూపుడు వేలితో చేయరాని నేరం చేయడం వల్లే ప్రజలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారని వివరిస్తున్నారు.
గిరగిరా తిరిగే ఫ్యానుకు ఓటు వేసి..
రెండేళ్ల కిందట చూపుడు వేలితో గిరగిరా తిరిగే ఫ్యానుకు ఓటు వేయడం వల్లే ప్రజలు ఇప్పుడు గిలగిల కొట్టుకుంటున్నారంటూ నరసింహ ప్రసాద్ జాతకం చెబుతున్నారు. ఓటర్ల ముఖంలో లక్ష్మీదేవి కనిపిస్తోన్నప్పటికీ.. ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తోందని మండిపడుతున్నారు. ఒక చేత్తో 10 రూపాయలను తీసుకుంటూ.. మరో చేతుల్లో 100 రూపాయలను పోగొట్టుకుంటోన్నారని జగన్ సర్కార్ పనితీరుపై ఎద్దేవా చేస్తున్నారు. దీనికి పరిహారంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని సూచిస్తున్నారు.
కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోతుందేమో గానీ..
కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోతుందేమో గానీ.. సైకిల్ మా్రం దూసుకెళ్తూనే ఉంటుందని నరసింహ ప్రసాద్ జోస్యం చెబుతున్నారు. 2024 ఫ్యాన్ తిరగడం ఆగిపోతుందని చెప్పారు. సైకిల్ మాత్రం రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాలకు వైపు పరుగులు తీస్తుందని అన్నారు. 2019లో చేసిన తప్పును ప్రజలు మళ్లీ చేయొద్దని విజ్ఞప్తి చేస్తోన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, రెండేళ్ల కిందట చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని చెప్పారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసినా..
2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో నరసింహ ప్రసాద్ పోటీ చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు చేతిలో పరాజయాన్ని చవి చూశారు. అయినప్పటికీ- చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక విభాగానికి ఆయన అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని, తిరుపతితోనే అది ఆరంభమౌతుందనే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.