తిరుమలలో తెలంగాణ గవర్నర్ తమిళిసై: టీటీడీ పాలక మండలి భేటీ..గరుడ వారధిపై కీలక నిర్ణయం
తిరుమల: తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వ స్వామివారిని దర్శించడానికి మంగళవారం సాయంత్రం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి గవర్నర్ కు పుష్పగుచ్ఛాలను ఇచ్చి స్వాగతం పలికారు. తిరుమల పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ ఉదయం నైవేద్యానంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. మొదట సంప్రదాయబద్ధంగా వరాహ స్వామిని దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గవర్నర్ ను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్, ఆమె కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, ప్రత్యేకాధికారిక ధర్మారెడ్డి, ఇతర అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రధాన అర్చుకులు గవర్నర్ కు స్వామివారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని బహూకరించారు.
ఇదిలావుండగా.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశమైంది. ఈ ఉదయం 11 గంటలకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో పాలక మండలి సమావేశం ఆరంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగబోతోంది. టీటీడీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులందరూ ఈ భేటీకి హాజరయ్యారు. గరుడ వారధి సహా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్ బాధ్యతలను స్వీకరించిన తరువాత టీటీడీ పాలక మండలి సమావేశం కావడం ఇది రెండోసారి. కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
తిరుపతిలో నిర్మించ తలపెట్టిన గరుడ వారధి కోసం తిరుమల నిధులను కేటాయింపుపై కొంతకాలంగా గందరగోళం నెలకొంది. స్వామివారి నిధులను ప్రజా పనుల కోసం ఖర్చు చేయాలా? వద్దా? అనే విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. గరుడ వారధి నిర్మాణం కోసం 675 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేశారు. ఇందులో 60 శాతం వాటా నిధులను టీటీడీ నుంచి సేకరించడానికి ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం మారింది.. టీటీడీ పాలక మండలి ఛైర్మన్, సభ్యులు కూడా మారిపోయారు.
ఈ నేపథ్యంలో- స్వామివారి నిధులను గరువ వారధి నిర్మాణానికి వినియోగించాలా? వద్దా? అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై ఈ సమావేశం సందర్భంగా ఓ స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆరు కిలోమీటర్ల పొడవుతో నిర్మించి తలపెట్టిన ఈ వంతె నిర్మాణం వల్ల తిరుమలకు రాకపోకలు సాగించే భక్తులకు ఇబ్బందులు ఉండవని, వంతెనను శ్రీవారి భక్తుల అవసరాల కోసమే నిర్మించ దలచినందున నిధులను కేటాయించడం వల్ల విమర్శలు రాకపోవచ్చని చెబుతున్నారు.