తిరుమలలో అరెస్ట్ అయిన తెలంగాణాకు చెందిన ఉన్నతాధికారి .. ఏం చేశారో తెలిస్తే షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక తెలంగాణ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఐపీఎస్ అధికారినని చెప్పిన సదరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం ఆయన పరువు తీసింది. ఆయనను అరెస్ట్ చేసే దాకా తీసుకెళ్ళింది.
తెలంగాణ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ డైరెక్టర్ అయిన అరుణ్ కుమార్ను అరెస్ట్ చేశారు తిరుమల పోలీసులు . తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ డైరెక్టర్ గా మంచి పొజీషన్ లో ఉన్న ఆ ఉన్నతాధికారికి పుట్టిన దుర్బుద్ధి ఆయన పరువు గంగపాలు చేసింది. ఇంతకీ ఆయన ఏం చేశారంటే ..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ తాను ఐపీఎస్ నంటూ బుధవారం జేఈవో కార్యాలయానికి వచ్చి ప్రోటోకాల్ దర్శనం అడిగాడు.
అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆయన నకిలీ ఐపీఎస్ అని గుర్తించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా అరుణ్ గతంలో పలువురు రాష్ట్ర మంత్రుల వద్ద ఓఎస్డీగా పనిచేసినట్లు గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం ఆయనను విచారణ జరుపుతున్నారు.
అరుణ్ సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉండి.. ఐపీఎస్ ఆఫీసర్ను అంటూ నకిలీ ఐడీ కార్డుతో దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది . ఖమ్మం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆయన హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు.
శ్రీవారి దర్శనం కోసం ఏకంగా నకిలీ ఐడీ సృష్టించి ఆయన ప్రోటోకాల్ దర్శనం కోసం ప్రయత్నం చెయ్యటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఇదేమి మాయరోగం అని ఆయన చేసిన ఘనకార్యాన్ని ఉద్దేశించి అందరూ మాట్లాడుకుంటున్నారు.