చంద్రబాబు పై నాడు - నేడు స్కీమ్: ప్లేస్ ఒక్కటే మారింది..మిగతాదంతా సేమ్ టూ సేమ్:నెటిజెన్ల సెటైర్స్
తిరుపతి: చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మరోసారి వాగ్యుద్ధానికి దారి తీసింది. విమర్శలు, ప్రతివిమర్శలకు కారణమైంది. వైఎస్సార్సీపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ టీడీపీ నేతలు మండిపడితోండగా.. అలాంటి వాటికి కేరాఫ్ అడ్రస్ ప్రతిపక్షమేనంటూ వైసీపీ నాయకులు కౌంటర్ అటాక్ ఇస్తోన్నారు.
కోవిడ్ ప్రొటోకాల్, మున్సిపల్ ఎన్నికల కోడ్ ఆధారంగా..
చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును పోలీసులు రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆయనను అక్కడే అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి బయటికి రానివ్వకుండా చాలాసేపు నిర్బంధించారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను చాలాసేపటి వరకు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి అడుగు పెట్టనివ్వలేదు పోలీసులు. ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చిన టీడీపీ నాయకులను కూడా అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు తరలించారు. తనను నిర్బంధించడానికి నిరసనగా అక్కడే బైఠాయించారు చంద్రబాబు. పోలీసుల తీరుకు నిరసన తెలిపారు.
టీడీపీ నేతలు భగ్గు..
ఈ ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే, ఎంపీ, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేపీ దివాకర్ రెడ్డి వంటి నేతలను అక్రమంగా జైలుపాలు చేస్తోన్న వైసీపీ సర్కార్ కుట్ర రాజకీయాలు.. తమ పార్టీ అధినేతను అడ్డుకోవడంతో పరాకాష్టకు చేరుకున్నట్టయిందని ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పిలుపునిచ్చారు.
నాడు-నేడు పథకంలో భాగంగా..
వైఎస్సార్సీపీ నాయకులు.. దీనికి కౌంటర్ ఇస్తోన్నారు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో నిర్బంధించిన విషయాన్ని గుర్తు చేస్తోన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్కు అనుకూలంగా విశాఖపట్నంలో తలపెట్టిన ప్రదర్శనలో పాల్గొనడానికి వెళ్లిన వైఎస్ జగన్, వైసీపీ సీనియర్ నేత వీ విజయసాయి రెడ్డి, ఇతర నాయకులను విమానాశ్రయం రన్వే మీదే అడ్డుకున్న సందర్భాన్ని వైసీపీ నేతలు తాజాగా ప్రస్తావిస్తోన్నారు.
ప్రతీకార రాజకీయాలు సమర్థనీయమా?
చిత్తూరు, తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందని, ప్రస్తుతం అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిధిలో ఉన్నారే తప్ప ప్రభుత్వ ఆధీనంలో లేరని వైసీపీ నాయకులు చెబుతోన్నారు. చంద్రబాబు చిత్తూరు, తిరుపతి పర్యటన నిర్వహించ తలపెట్టడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి వస్తోందని సమర్థించుకుంటోన్నారు. అరెస్టులు, ప్రతి అరెస్టులతో రాష్ట్ర రాజకీయాలు ఒకరకంగా తమిళనాడుకు తీసిపోని విధంగా తయారయ్యాయనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి.