Tirumala: గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్గా శ్రీవారి బ్రహ్మోత్సవం, బతుకమ్మ శకటాలు..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అంగరంగ వైభవంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి. రాజ్పథ్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలు దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు అద్దం పట్టాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే మూల సూత్రాన్ని చాటి చెప్పాయి. రక్షణరంగంలో మహిళలు ఏ స్థాయిలో దూసుకెళ్తున్నారనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాయి. అలాగే- వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాలు అహూతులను అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బెల్జియం అధ్యక్షుడు జైర్ బొర్సొనారో వాటిని శకటాలను ఆసక్తిగా తిలకించడం కనిపించింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం థీమ్గా..
రాజ్పథ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవానికి సంబంధించిన థీమ్తో రూపొందించిన శకటం ఇది. శ్రీవారి ఆనంద నిలయం, బ్రహ్మోత్సవ ఊరేగింపు.. ఇలా ప్రత్యేక ఆకర్షణలతో సాగిందా శకటం. ఆరు సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏపీ శకటానికి గణతంత్ర దినోత్సవం వేడుకల్లో చోటు దక్కింది. కూచిపూడి నృత్య ప్రదర్శన, కొండపల్లి హస్తకళలలను ఈ శకటంపై ప్రదర్శించారు.
బతుకమ్మగా తెలంగాణ శకటం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి థీమ్తో రూపొందించిన ఆ రాష్ట్ర శకటం అందరి దృష్టినీ ఆకర్షించింది
గిరిజన సంప్రదాయ నృత్యాలు
గిరిజన సంప్రదాయ నృత్యాలు, పూలతో అలంకరించిన నిలువెత్తు బతుకమ్మను ఈ శకటంపై ప్రదర్శించారు. ఏపీ తరహాలోనే తెలంగాణ శకటానికి కూడా గణతంత్ర దినోత్సవం వేడుకల్లో స్థానం దక్కింది. ఈ అవకాశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు వదలదలచుకోలేదన్నట్టుగా.. తమతమ రాష్ట్రాల సంప్రదాయాలు ఉట్టిపడేలా శకటాలను రూపొందించారు.