శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే: కొండ బోసిపోతుందా? భక్తుల రాకపై: గైడ్లైన్స్: 29న టీటీడీ
తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో ఈ ఏడాది వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వచ్చే నెల 19వ తేదీ నుంచి ఆరంభం కానున్నారు. తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా కొనసాగనున్నాయి. ఈ ఏడాది అధిక మాసం ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏడుకొండలవాడికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను వెల్లడించారు.
ఈ ఏడాది రెండుసార్లు..
భాద్రపదం, ఆశ్వియుజ మాసాల్లో ఈ ఉత్సవాలను చేపట్టనున్నారు. భాద్రపదంలో నిర్వహించే ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 19 నుంచి 27 వరకు, ఆశ్వియుజ మాసంలో మరోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేసినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
సెప్టెంబర్లో సాలకట్ల.. అక్టోబర్లో నవరాత్రి..
సాలకట్ల బ్రహోత్సవాలకు వచ్చేనెల 18వ తేదీన అంకురార్పణం చేస్తారు. 19వ తేదీ-ధ్వజారోహణం, 23న-గరుడసేవ, 24న-బంగారు రథోత్సవం, 26న-రథోత్సవ ఉంటుంది. 27వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరుసటి నెల అంటే అక్టోబర్ 16వ తేదీన దసరా పండుగ సందర్భంగా మరోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఇవి 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా, లక్షలాది మంది భక్తుల మధ్య నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా..
ఈ సారి ఆ తరహా పరిస్థితులు లేవు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే అంశంపై టీటీడీ ఇంకా ఖరారు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా, మార్గదర్శకాలకు లోబడి చేపట్టాల్సి ఉంటుంది. భక్తులకు పరిమితంగా అనుమతించాలా? లేక ఏకాంతంగా నిర్వహించాలా? అనే విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. దీనికోసం ఈ నెల 29వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం కానున్నట్లు సమాచారం.
Recommended Video
తిరుమల అర్చక కుటుంబాల్లో కరోనా కల్లోలం..
ఇదిలావుండగా.. శ్రీవారి సేవలో గడిపే తిరుమల అర్చక కుటుంబాల్లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. అటు టీటీడీ ఉద్యోగులు, ఇటు అర్చకులు వందలాదిమంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 743 మంది టీటీడీ అర్చకులు, ఉద్యోగులు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు మరణించారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూశారు. అలాగే తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామి ఆలయం నుంచి డెప్యుటేషన్పై తిరుమలకు వెళ్లిన మరో అర్చకుడు తుదిశ్వాస విడిచారు. ఈ పరిస్థితుల్లో బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏకాంతంగా నిర్వహించాలనే ప్రతిపాదన వినిపిస్తోంది.