తిరుమలలో డిక్లరేషన్ ఎత్తేయాల్సిందే- కొడాలి నాని పునరుద్ఘాటన- వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడి..
తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులకు ప్రభుత్వం అమలు చేస్తున్న డిక్లరేషన్ విధానాన్ని మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే డిక్లరేషన్పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే ఆయన మాత్రం డిక్లరేషన్ విషయంలో తన అభిప్రాయం మారబోదని మరోసారి స్పష్టం చేశారు.
తిరుమలలో అమలు చేస్తున్న డిక్లరేషన్ విధానం ఎత్తేయాల్సిందేనని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పునరుద్ఘాటించారు. అది వెంకటేశ్వరస్వామి భక్తుడిగా తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఏపీలో ఆరుకోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా జగన్ తిరుమలకు వెళ్తున్నారని, ఏపీలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారన్నారు. జగన్ కేవలం హిందువుల ప్రతినిధిగా మాత్రమే వెళ్లడం లేదన్నారు. రేపు సీఎం జగన్ తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
డిక్లరేషన్పై సంతకం చేశాకే తిరుమల వెళ్లాలని బీజేపీ నేత సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేయడాన్ని మంత్రి కొడాలి తీవ్రంగా తప్పుబట్టారు. డిక్లరేషన్పై సంతకం చేయాలనడం నీచ రాజకీయమని ఆయన అభివర్ణించారు. తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని నాని తెలిపారు. తానేం తప్పు మాట్లాడలేదన్నారు. ఆ విషయంలో చంద్రబాబుకూ, సోము వీర్రాజుకు క్షమాపణ చెప్పాలా అని మంత్రి కొడాలి ప్రశ్నించారు.