తిరుమల డిక్లరేషన్ రగడ ... ఎప్పటి నుండో ఉన్న ఈ నిబంధన టీటీడీ ఎప్పుడు తొలగించింది?
ఏ మతం వారైనా తిరుమలకు రావచ్చని, స్వామివారిని దర్శించుకొనేందుకు డిక్లరేషన్ అవసరం లేదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి, వెంకన్నను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎక్కడా సంతకం చేయాల్సిన అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి . ఈ నిబంధన ఎప్పటిదో అని తప్పకుండా పాటించి తీరాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు.
తిరుమలలో స్వామి దర్శనానికి నో డిక్లరేషన్ అన్న టీటీడీ చైర్మన్
వెంకటేశ్వర స్వామిపై నమ్మకంతో వచ్చే వారు ఎవరైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవచ్చని, డిక్లరేషన్ అవసరం లేదని వైవీ సుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . ఈ నిబంధన ఎప్పటి నుండో వస్తుంది. ఈ విషయంలో అనేకమార్లు పెద్ద ఎత్తున వివాదాలు కూడా చెలరేగిన నేపధ్యంలో ప్రస్తుతం ఇదొక రగడగా మారే అవకాశం ఉంది .తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చాలా కాలంగా అన్యమతస్థులుగా కనిపించిన వారి దగ్గర నుండి కచ్చితంగా డిక్లరేషన్ తీసుకుంటున్నారు. అబ్దుల్ కలాం ,సోనియా గాంధీ వంటి ప్రముఖులే తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ తీసుకున్న సందర్భాలున్నాయి.
జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవటంపై గతంలోనూ రగడ
ఇతర మతస్థులు శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్లిన ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదు. గతంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున వివాదం కూడా కొనసాగింది. జగన్ ఇంట్లోనే మత బోధకులు ఉన్నారని, ఆయన కుటుంబం క్రైస్తవాన్ని పాటిస్తుందని, ఏ కార్యక్రమమైనా క్రైస్తవ పద్ధతిలోనే జరుగుతుందని అందరికీ తెలుసు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ డిక్లరేషన్ పై సంతకం పెట్టకుండా ఆలయం లోకి వెళ్లే ప్రయత్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
టీటీడీ చైర్మన్ ప్రకటన అధికారిక ప్రకటనా ? టీటీడీ నిబంధన తొలగించిందా
గత బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండానే సీఎం జగన్ తిరుమలకు వెళ్లి వచ్చారు. ఈసారి కూడా బ్రహ్మోత్సవాల సమయంలో జగన్ తిరుమలకు వెళ్లనున్న నేపథ్యంలో మరోమారు డిక్లరేషన్ వివాదం తెరమీదికి వచ్చింది . ఇదే సమయంలో వై వి సుబ్బారెడ్డి చేసిన ప్రకటన కూడా గందరగోళానికి గురి చేస్తుంది టీటీడీ చైర్మన్ హోదాలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించడం, మరి టిటిడి బోర్డు సమావేశంలో డిక్లరేషన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారా ? అలాంటి ప్రకటన టిటిడి బోర్డు నుండి చేయకుండానే డిక్లరేషన్ అవసరం లేదని ఎలా ప్రకటిస్తారు అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
వైవీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు , హిందూ సంఘాలు
ఈనెల 23వ తేదీన సీఎం హోదాలో స్వామివారి గరుడ సేవ లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్న నేపథ్యంలో తాజాగా వై.వి.సుబ్బారెడ్డి డిక్లరేషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనిపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పటికే తిరుమలలో అన్య మత ప్రచారం జరుగుతుందని నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్ష పార్టీలు , హిందూ సంఘాలు తాజా వ్యాఖ్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి .