తిరుమల అంతరాలయం: రాజ్యమేలుతోన్న నిశ్శబ్ధం: భక్తులు లేకుండా: శ్రీవారికి రోజువారీ సేవలు
తిరుపతి: కరోనా వైరస్ ప్రభావం తిరుమలను కమ్మేసింది. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ లేనివిధంగా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అడుగు తీసి అడుగు పెట్టడానికి కష్టతరమనిపించే శ్రీవారి ఆనంద నిలయం ప్రాంగణం బోసిపోయింది. గోవిందుడి నామస్మరణతో మారుమోగిపోవాల్సిన తిరుమల అంతరాలయంలో నిర్మానుష్యంగా మారింది. శ్రీవారికి రోజువారీ సేవలు యధాతథంగా కొనసాగుతున్నప్పటికీ.. అర్చకులు, కొద్దిమంది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రమే దీనికి హాజరవుతున్నారు.
కరోనా వైరస్ వల్ల ముందు జాగ్రత్తచర్యగా..
ప్రాణాంతక కరోనా వైరస్ను వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 31వ తేదీ వరకు భక్తుల దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా ఉండటానికి భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. అలాగని- ఆలయాన్ని పూర్తిగా మూసివేయలేదు. స్వామివారికి రోజువారీ సేవలు కొనసాగుతున్నాయి. తెల్లవారు జామున సుప్రభాత సేవ మొదలుకుని అన్ని రకాల పూజాదికాలను కొనసాగిస్తున్నారు అర్చకులు.
నిర్జన ప్రదేశంగా
వేలాదిమంది భక్తులతో నిత్యం కిటకిటలాడే శ్రీవారి ఆనంద నిలయం.. ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోంది. అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బంది అనిపించేంతగా క్రిక్కిరిసిపోవాల్సిన ఆలయ ప్రాంగణంలో అయిదు రోజులుగా బయటి వ్యక్తి కాలు మోపలేని పరిస్థితి అక్కడ నెలకొంది. కరోనా వైరస్ ప్రభావం వల్ల తిరుమల ఖాళీగా మారింది. భక్తులు వేచివుండే కంపార్ట్మెంట్లు, క్యూలైన్లను ఎక్కడికక్కడ తాళాలు వేశారు టీటీడీ సిబ్బంది.
అతిథి గృహాలకూ తాళాలు..
తిరుమలలోని అన్ని అతిథి గృహాలు, కాటేజీలు మూతపడ్డాయి. వాటి నిర్వహణ కోసం కొద్దిమంది సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. భక్తులెవరూ లేకపోవడం వల్ల దుకాణాలు మూతపడ్డాయి. దుకాణదారులు ఎప్పుడో కొండ దిగేశారు. తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి టోల్గేట్ తెరచుకోలేదు. స్వామివారి నిత్య సేవలకు అవసరమైన సామాగ్రిని తరలించడానికి, కొండపై నివసించే అర్చకులు, ఇతర టీటీడీ ఉద్యోగులకు అవసరమైన సరుకులను తీసుకెళ్లే వాహనాలు, అధికారుల కార్లు తప్ప బయటి వాహనాలను అనుమతించట్లేదు.
అన్నమయ్య భవన్లో అధికారులు మకాం..
తిరుమలలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అధికారులు తిరుపతి అలిపిరి రోడ్లోని అన్నమయ్య భవన్లో మకాం వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి తదితరులు అడ్మిన్ కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తిరుమలకు వెళ్లొస్తున్నారు. అర్చకులు అక్కడే ఉంటూ.. స్వామివారి సేవలను కొనసాగిస్తున్నారు.