ఆరుబయటే చలికి వణుకుతూ : సర్వదర్శనానికి 20 గంటలు..
తిరుమల గిరులు భక్తులతో నిండిపోయాయి. వరుస సెలవులతో తిరుమల కిటకిటలాడుతోంది. సంవత్సరం చివర కావ టం..ఉద్యోగుల కుటుంబాలతో తిరుమల కిక్కిరిసి పోయింది. సర్వ దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. అనేక మంది భక్తులకు వసతి లేక ఆరు బయటే చలికి వణికి పోతున్నారు...
తిరుమల లో భక్త జన పోటెత్తారు. ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. వరుస సెలవులు, క్రిస్మస్ పండుగకు తోడు ఏడాది చివరివారం కావడంతో మిగిలిపోయిన సెలవులను వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు.
వైకుంఠద్వార దర్శనం : పోటెత్తిన భక్తజనం: తరలి వచ్చిన ప్రముఖులు
క్యూలైన్లు, ఉద్యానవనాలు, వసతి కేటాయింపు కేంద్రాలు, ఆలయ పరిసరాలు, కల్యాణకట్ట, అన్నదానం భవనం, లగేజీ సెంటర్లు, హోటళ్లు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ భక్తులు కిక్కిరిసి పోతున్నారు.వసతి కోసం సీఆర్వో, ఇతర కౌంటర్ల వద్ద, ఉచిత సముదాయాల్లో లాకర్ల వద్ద భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కొందరు బయట రోడ్లపై, ఖాళీ స్థలాల్లో చలిలో వణుకుతూ ఎదురు చూస్తున్నారు.
ఇక, సర్వదర్శనం భక్తులు క్యూకాంప్లెక్స్ నిండి వెలుపల 2కిలోమీటర్ల మేర ఉంది.కిక్కిరిసిన క్యూలో ఊపిరాడక చాలామంది మధ్యలో ఉన్న గేట్ల నుంచి, బారికేడ్లు దాటుకొని బయటపడుతున్నారు. లడ్డూ టోకెన్లు మంజూరు చేసే కాంప్లెక్స్ సైతం భక్తులతో నిండిపోయింది. సాధారణ సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు, స్లాటెడ్ దర్శనాలకు దాదాపు 3గంటల సమయం పడుతోంది. పెద్దసంఖ్యలో వాహనాలు తరలిరావడంతో తిరుమలలో ట్రాఫిక్కు అంతరాయం సైతం ఏర్పడుతోంది. భక్తులకు అధికార యంత్రాంగం అన్నపానీయాలను వితరణ చేసింది.
వారాంతం వరకు విపరీత రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. జనవరి ఒకటో తేదీ నాడు మరింత మంది విఐపి లు..భక్తులు పెద్ద సంఖ్య లో స్వామి వారి దర్శనానికి తరలి వచ్చే అవకాశం ఉందని చెబుతున్న అధికారులు..ప్రత్యేక ఏర్పాట్లు పై దృష్టి సారించారు..