Tirumala: సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీవారు, భక్త బృందాలు, కర్పూరహారతులు!
తిరుమల/తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ ప్రాంతాలకు చెందిన 15 కళాబృందాలు ప్రదర్శనలిచ్చాయి.ఇందులో పుదుచ్చేరికి కళాకారులు ఓళియాట్టం, పొడుగు కర్రలతో చేసిన సంప్రదాయ భజన, కర్ణాటక కళాకారుల భరతనాట్యం, మహారాష్ట్ర కళాకారులు కోలాటం భజన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మాడ వీధుల్లో విహరించిన శ్రీవారు
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
కర్పూర హారతులు
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
అలరిస్తున్న భజన మండలి
తూర్పుగోదావరి జిల్లా మల్లేపల్లికి చెందిన మారుతి నాసిక్ డోలు బృందం అఘోరా నృత్యం, భువనేశ్వరి భజన మండలి తాళాలతో చేసిన నృత్యం, అనంతపురానికి చెందిన శ్రీకృష్ణ బృందం సంప్రదాయ నృత్యం, బెంగళూరుకు చెందిన కైలాసధర బృందం నృత్యం, తిరుపతికి చెందిన ఆనందనిలయవాసా భజన మండలి నృత్య కార్యక్రమాలు అలరించాయి.
ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర బృందాలు
వీటితోపాటు విశాఖపట్నం, అనకాపల్లి, విశాఖ, తిరుమల, తిరుపతి కళాకారుల కోలాటం భజన, తెలంగాణ రాష్ట్రం మహబూబర్ నగర్ కళకారుల చెక్కభజన, అన్నమయ్య జిల్లా కళాకారుల పిల్లనగ్రోవి నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీవారి బ్రహోత్సవాలు కళ్లారా చూడటానికి లక్షలాది మంది స్వామివారి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు.