కంటైన్మెంట్ జోన్లోకి తిరుమల పుణ్యక్షేత్రం... 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్...
తిరుపతిలో పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుణ్య క్షేత్రం తిరుమలను 'కంటైన్మెంట్ జోన్'గా ప్రకటించారు. అయితే శ్రీవారి ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని ప్రకటించారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత శ్రీవారి ఆలయాన్ని తెరిచి నేటికి సరిగ్గా నెల రోజులు గడిచింది.
మరోవైపు తిరుమలను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడంపై టీటీడీ అధికారులు మండిపడుతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా తిరుమలను కంటైన్మెంట్ జోన్గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం అని,జనాలు నివాసం ఉండే చోటు కాదని చెబుతున్నారు. పాజిటివ్గా తేలిన కేసులన్నీ తిరుపతి పట్టణంలో ఉండేవారివేనని... ఒకవేళ తిరుమలలో కంటైన్మెంట్ ప్రకటించాలంటే... 2,3 రోజుల ముందే తమకు సమాచారం ఇవ్వాల్సింది అని పేర్కొన్నారు.
అయితే ఇప్పటివరకూ 80 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని జిల్లా కలెక్టర్ ఎన్.భరత్ గుప్తా వెల్లడించడం గమనార్హం. ప్రతీ రోజు 200మంది సిబ్బందికి కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. భక్తులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నామని.. ఇప్పటివరకూ 800 మంది భక్తులకు టెస్టులు చేశామని చెప్పారు. అందులో ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదన్నారు. కాబట్టి తిరుమల సిబ్బందికి భక్తుల ద్వారా కరోనా సోకి ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
లాక్ డౌన్ సడలింపుల తర్వాత మొదట్లో రోజుకు 6వేల మంది భక్తులను అనుమతించిన అధికారులు... ఇప్పుడు 12 వేల మంది వరకూ అనుమతిస్తున్నారు.
ఇక గురువారం(జూలై 9) రాష్ట్రంలో కొత్తగా 1555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1500 మంది రాష్ట్రానికి చెందినవారు కాగా,మిగతా 55 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిగా నిర్దారించారు. మరో 13 మంది కరోనాతో మృతి చెందారు.
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మొత్తం 277 మంది మృతి చెందారు. అత్యధికంగా కర్నూలులో ఇప్పటివరకూ 2795 కేసులు నమోదవగా.. గుంటూరులో 2663,అనంతపురంలో 2659 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2001 కేసులు నమోదయ్యాయి.