శ్రీవారి బ్రహ్మోత్సవాలు ...నేడే కీలక ఘట్టం .. గరుడ వాహన సేవ
కోరి కొలిచిన వారికి కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అన్గారనగా వైభవంగా జరుగుతున్నాయి . సెప్టెంబర్ 30 నుండి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు . తిరుమాడ వీధుల్లో ఆ మలయ్యప్ప స్వామి విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల భక్త జనంతో పోటెత్తుతుంది.సెప్టెంబర్ 30వ తేదీన మొదలైన స్వామీ వారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 8వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత ఘనంగా కొనసాగనున్నాయి.
నేడు స్వామివారికి గరుడ వాహన సేవ
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తొమ్మిది రోజుల పాటు స్వామివారికి ఉదయం, సాయంత్రం జరిగే వాహన సేవలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆ దేవదేవుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక నేడు శ్రీవారికి గరుడ వాహన సేవ జరగనుంది. స్వామి వారి వాహన సేవల్లో అత్యంత కీలకమైనది గరుడ వాహన సేవ. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతే కాదు సర్పదోష హరణం జరుగుతుందని , దివ్యమైన జ్ఞానం కలుగుతుందని ప్రశస్తి.
ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే
సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని , ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్తారు . కాబట్టి, బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ విశిష్టత సంతరించుకుంది. వేద స్వరూపుడైన గరుత్మంతుడు వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైనా అంగప్రత్యాంగాలు కలవాడు. శ్రీమహావిష్ణువు గరుడ సమ్మేళనం, వేదస్వరూప శీర్షాలుగా తెలుస్తుంది. అంతేకాదు, శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మొత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే కాబట్టి ఈ వాహన సేవకు అంతటి ప్రాధాన్యం .
గరుడ వాహన సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి నిత్యం మూల విరాట్ కు అలంకరించే అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీహారాలను గరుడ సేవలో అలంకరిస్తారు. గరుడోత్సవంలో స్వామి ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగుతాడు .ఆ గరుడ వాహనుడైన శ్రీనివాసుని దర్శించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాడా విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శుక్రవారం, అక్టోబర్ 4న శ్రీవారికి గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు. గరుడ సేవకు టీటీడీ సైతం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.