Tirumala Tirupati Devashthanams: శ్రీవారి భక్తులకు షాక్: తిరుమలలో అద్దె గదుల రేట్లు భారీగా పెంపు..!
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు భారీగా షాక్ ఇచ్చారు. కలియుగ వైకుంఠంలా భాసిల్లుతున్న తిరుమలను సందర్శించడానికి దేశ, విదేశాల నుంచి భక్తుల కోసం అందుబాటులో ఉన్న అద్దె గదుల రేట్లను భారీగా పెంచారు. ఇదివరకు ఉన్న ధరలను రెట్టింపు చేశారు. పెంచిన అద్దె గదుల రేట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చేశాయి కూడా. తిరుపతిలో ఉన్న అద్దె గదుల ధరల్లో మాత్రం ఎలాంటి సవరణలు చేయలేదు. యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అదికారి వెల్లడించారు.
ఆలయాల్లో చోరీలన్నీ చంద్రబాబు హయంలోనే !? అప్పుడు బెజవాడ..ఇప్పుడు తిరుపతి.. వైఎస్ఆర్సీపీ ఏం చెబుతోంది
పెంచిన రేట్ల ప్రకారం..
తిరుమలలో అందుబాటులో ఉన్ననందకం అద్దె గదుల రేట్లు 600 నుంచి వెయ్యి రూపాయలకు పెరిగింది. కౌస్తుభం, పాంచజన్యంలో ఇదివరకు 500 రూపాయలకు లభించే అద్దె గది.. సవరించిన ధరల ప్రకారం వెయ్యి రూపాయలకు చేరింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం తిరుమలలో 100 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు వేర్వేరు కేటగిరీల్లో అద్దె గదులు అందుబాటులో ఉన్నాయని, వాటిల్లో నందకం, కౌస్తుభం, పాంచజన్యంలో మాత్రమే రేట్లను సవరించాల్సి వచ్చిందని వెల్లడించారు. మిగిలిన వసతి గృహాల్లో ఉండే అద్దె గదుల రేట్లను పెంచలేదని అన్నారు.
తిరుపతిలో యధాతథంగా..
తిరుపతిలో టీటీడీ ఆధీనంలో ఉన్న అద్డె గదుల రేట్లలో మార్పులు చేయలేదు. శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం వసతి గృహాల సముదాయంలో గదుల అద్దెను ఇప్పుడున్న విధంగానే కొనసాగుతాయని ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. మాధవం మినహా మిగిలిన రెండు చోట్ల సాధారణ గది.200, ఏసీ 400, డీలక్స్ ఏసీ 600 రూపాయలుగా ఉంది. కాస్త విలాసవంతమైన వసతిగృహంగా పేరున్న మాధవంలో గదుల ఛార్జీలు ఏసీ 800, డీలక్స్ ఏసీ వెయ్యి రూపాయలుగా ఉంది.