ఫైవ్ స్టార్ హోటల్ గదులు అనుకుంటున్నారా? కాదు..తిరుపతి రైల్వేస్టేషన్
తిరుపతి: అక్కడ అడుగు పెట్టగానే ఎదురుగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అయిదు అడుగుల ఫొటో కనిపిస్తుంది. దాని పక్కనే అన్ని రకాల దినపత్రికలు అమర్చిన ఓ స్టాండ్. చుట్టూ విలాసవంతమైన సోఫాలు, విశాలమైన హాలు కనువిందు చేస్తాయి. మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ ఇంటర్ నెట్ తో అనుసంధానించి ఉండటానికి వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. మన వెంట ఉన్న లగేజీని దాచుకోవడానికి లాకర్ సౌలభ్యం కూడా.
కంపు కొట్టని, పాన్, గుట్కా మరకలు కనిపించని టాయ్ లెట్లు అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడి కుళాయిలన్నీ సెన్సర్ తో పనిచేస్తాయి. ఒక్క చుక్క కూడా నీరు వృధాగా పోదు. నీటి దుబారాను అరికట్టడానికి అత్యాధునికమైన సెన్సర్ వ్యవస్థతో పని చేసేలా కుళాయిలను అమర్చారు. ఇవన్నీ చూసి, అది ఏ ఫైవ్ స్టార్ హోటలో లేదంటే, ఏ అంతర్జాతీయ విమానాశ్రయం లాంజ్ అనుకుంటే పొరపాటే. అవి రైల్వేస్టేషన్ వెయిటింగ్ రూమ్.
3500 ఏసి గదులు : 155 విమాన టిక్కెట్లు : పది కోట్ల పైగా ఖర్చుతో ఢిల్లీ దీక్ష..!
తిరుపతి రైల్వేస్టేషన్ లో కొత్తగా నిర్మించిన ప్రయాణికుల వేచి ఉండు గది. తిరుపతి రైల్వేస్టేషన్ లోని 4, 5 ప్లాట్ ఫాంలపై ఆకట్టుకునే రీతిలో దీని నిర్మాణం సాగింది. చూడగానే.. లోనికి అడుగు పెట్టగానే.. సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టే భావన కలుగుతుంది. సాధారణంగా రైల్వే ప్లాట్ ఫాంలపై ఉండే రణ, గొణ ధ్వనులు మనకు వినిపించవు. మంద్రస్థాయిలో సంగీతం మన చెవులకు ఇంపుగా సోకుతుంది. ఈ విశాలమైన, అత్యాధునికమైన వెయిటింగ్ రూమ్ లను రైల్వేశాఖ కొత్తగా నిర్మించింది.
దీని నిర్మాణం కోసం రైల్వే శాఖ 20 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. దీని విస్తీర్ణం 1200 చదరపు మీటర్లు. ఒకేసారి 210 మంది ప్రయాణికులు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ మల్య త్వరలోనే ఈ గదిని ప్రారంభించనున్నారు. సుమారు 12 సంవత్సరాల కిందట.. తిరుపతి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్లు పట్టింది. తిరుపతితో దేశవ్యాప్తంగా మరికొన్ని రైల్వే స్టేషన్లను కూడా ఇదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు.