వెంకన్న భక్తులకు మరో సౌకర్యం: విమానాశ్రయం రన్ వే విస్తరణ..బోయింగ్ విమానాలొచ్చేస్తాయ్
తిరుపతి: దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తుల కోసం మరో సౌకర్యం అందుబాటులోకి రానుంది. తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల వెయిటింగ్ రూమ్ ను ఆధునికీకరించిన కేంద్రప్రభుత్వం.. ఈ సారి విమానాశ్రయంపై దృష్టి పెట్టింది. తిరుపతి విమానాశ్రయం రన్ వేను విస్తరించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. రన్ వే విస్తరణ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 177 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనికి సంబంధించిన పనులు బుధవారం ఆరంభం అయ్యాయి. ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు రన్ వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రన్ వేను విస్తరించడం వల్ల సీట్ల సామర్థ్యం ఎక్కువగా ఉండే బీ-747, బీ-777-300 ఈఆర్ రకానికి చెందిన బోయింగ్ విమానాలు విమానాశ్రయంలో దిగడానికి అనువుగా ఉంటుంది.
అంతర్జాతీయ హోదా ఉన్నా..సౌకర్యాలు సున్నా
రేణిగుంట విమానాశ్రయం అంతర్జాతీయ హోదా ఉంది. అక్కడి సౌకర్యాలు మాత్రం ఆ స్థాయిలో ఉండవు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేణిగుంట సమీపంలో విమానాశ్రయాన్ని నిర్మించింది. సౌకర్యాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమాన సర్వీసు ఒక్కటి కూడా లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రన్ వేను విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. 2022 నాటికి రన్ వే విస్తరణ పనులు మొత్తంగా పూర్తవుతాయని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు చెబుతున్నారు. రన్ వే తో పాటు అప్ట్రాన్ ను కూడా పెంచాల్సి వస్తుందని చెప్పారు.
రన్ వే విస్తరణ వల్ల లాభమేంటి?
విస్తరణ పనుల కోసం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 40 ఎకరాల మేర భూమిని సేకరించి, ఎయిర్పోర్టు అథారిటీకి అప్పగించింది. ప్రస్తుతం రన్వే 45 మీటర్ల వెడల్పు 2,285 మీటర్ల పొడవు ఉంది. తాజాగా చేపట్టిన పనుల వల్ల దీని పొడవును 2285 మీటర్ల నుంచి 3,810 మీటర్లకు పెంచుతారు. బోయింగ్ వంటి భారీ విమానాలు దిగడానికి రన్ వే పొడవుగా ఉండటం అత్యవసరం. భారీ విమానాలైనందున అవి పైకి ఎగరాలంటే.. చాలా దూరం రన్ వే మీద పరుగెత్తుకెళ్లాల్సి ఉంటుంది. అలా చేయాలంటే ఇప్పుడున్న 2285 మీటర్ల రన్ వే ఏ మాత్రం సరిపోదు. ఈ ఉద్దేశంతోనే రన్ వేను విస్తరిస్తున్నారు. దీనితో పాటు విమానాశ్రయంలో ఏడు పార్కింగ్ బేలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. విస్తరణ పూర్తయితే అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఆరంభమౌతాయి.
వెంకయ్య నాయుడు ఏం చెప్పారు?
రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్రాలు, కేంద్రం కలిసి పని చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. రేణిగుంట విమానాశ్రయంలో బోయింగ్ వంటి భారీ విమానాల రాకపోకలకు అనువుగా ఉండేందుకు రన్ వే ను విస్తరించినట్టు తెలిపారు. పీపీపీ పద్ధతిలో పనులు పూర్తవుతాయని అన్నారు. త్వరలో తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలవనున్నారని తెలిపారు. ఏపీలో విమానాశ్రయాలను అభివృద్ధి పరుస్తున్నామని చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాలను ఆధునికీకరించినట్టు చెప్పారు. ప్రధానమంత్రి ఉడాన్ పథకంలో భాగంగా అతి చౌకగా అందిస్తోన్న విమానయాన సౌకర్యాన్ని అంతా వినియోగించుకోవాలని కోరారు. వచ్చే పదేళ్లలో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా ఉంటుందని చెప్పారు. ఇటీవల ప్రారంభించిన కడప విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల శాతంలో 255 శాతం వృద్ధి కనిపించిందని చెప్పారు. ఏ దేశంలో అయినా రవాణా వ్యవస్థ అభివృద్ధి సాధిస్తే.. ఆ దేశ ఆర్థికరంగం అంతే వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పరంగా తిరుపతికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ వచ్చే నాలుగైదేళ్లలో దేశంలోని అన్ని విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో 103 విమానాశ్రయాలు, హెలిప్యాడ్లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.