భారతి సిమెంట్స్, హెరిటేజ్ నుంచి నిధులేమైనా తెచ్చారా? పథకాలకు మీ పేర్లెందుకు: బీజేపీ నేత
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ఆరంభించింది. బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు తిరుపతిలో మకాం వేశారు. పార్టీ నాయకులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి తిరుపతిలో పార్టీ క్యాడర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీని ఉద్దేశించి ఆరోపణాస్త్రాలను సంధించారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని, ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
Recommended Video
గవర్నర్గా జానారెడ్డి?: సాగర్ ఉప ఎన్నికలో కుమారుడు? బీజేపీ ప్లాన్: హస్తినలో అనూహ్య పరిణామాలు
నారా కుటుంబం, వైఎస్ కుటుంబం రెండూ రాష్ట్రానికి ద్రోహం చేశాయని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఈ రెండు కుటుంబాలకు చెందిన వారే అధికారంలో ఉండాలనే కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రాన్ని కుటుంబ పరిపాలన కిందికి తీసుకొచ్చాయని, నట్టేట ముంచేశాయని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తోంటే.. ఇక్కడి ప్రభుత్వం వాటిని మాయం చేస్తోందని ఆయన విమర్శించారు. సొమ్ము కేంద్రానికి, షోకు రాష్ట్ర ప్రభుత్వానిది అన్నట్టుగా తయారైందని అన్నారు.
జీవించి ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా తమ పేర్ల మీద పథకాలను ప్రవేశపెట్టబోరని, చంద్రబాబు, జగన్ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చారని చెప్పారు. తమ పేర్ల మీద పథకాలను పెట్టుకోవడానికి.. వాళ్ల సొంత సంస్థలైన భారతి సిమెంట్ నుంచో లేదా సండూర్ పవర్ ప్రాజెక్టు నుంచో నిధులు తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. చంద్రబాబు, వైఎస్ జగన్ ప్రభుత్వాల్లో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం కూాడా కేంద్రానిదేనని అన్నారు.
వైఎస్ జగన్.. వెంటనే తమ పథకాలను పునఃసమీక్షించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోలను ముద్రించాలని, కేంద్రం పేరును పెట్టాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చు జగన్ ప్రభుత్వం పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో 149 కులాలు ఉంటే.. 56 కార్పొరేషన్లు మాత్రమే ఏర్పాటు చేశారని అన్నారు. ముస్లింలకు ఇష్టం లేకపోయినా.. వాళ్లను చీల్చి నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం కట్టబెట్టిందని మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించలేదని విమర్శించారు.