రేపటితో తిరుపతిలో గప్చుప్-చంద్రబాబుపై దాడి, గురుమూర్తి కులం ప్రభావమెంత ?
ఏకపక్షంగా సాగుతుందని భావించిన తిరుపతి ఉపఎన్నిక కాస్తా చివరికొచ్చేసరికి హోరాహోరీగా మారిపోయింది. నోటిఫికేషన్ తర్వాత ఉన్న పరిస్దితులు చివరి వరకూ కొనసాగకపోగా.. కొత్త సమస్యలు, వివాదాలు ఉపఎన్నికలో అజెండాగా మారిపోయాయి. అన్నింటికంటే మించి ప్రతీ రోజూ వందల సంఖ్యలో వస్తున్న కొత్త కరోనా కేసులు ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న వందలాది మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు చివరి నిమిషంలో చోటు చేసుకున్న వివాదాలు సైతం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
తిరుపతి ఉపఎన్నికకు కరోనా ముప్పు-జగన్, పవన్ దూరం-మొండిగా చంద్రబాబు
తిరుపతిలో రేపటితో ప్రచారం ముగింపు
హోరాహోరీగా సాగిన తిరుపతి ఉపఎన్నికల ప్రచారం రేపటితో ముగియబోతోంది. రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత తిరుపతి లోక్సభ స్ధానం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి తెరపడనుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగబోతోంది. దీంతో ఇవాళ, రేపు ప్రచారాన్ని హోరెత్తిచేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులొడ్డుతున్నాయి. ఈ సందర్బంగా కొత్త వివాదాలూ తెరపైకి వస్తున్నాయి. అసలే కులాల పోరుగా మారిపోయిన తిరుపతి ఉపఎన్నికలో తాజా వివాదాలు ఏమాత్రం ప్రభావం చూపుతాయన్న దానిపై తుది ఫలితం ఆధారపడబోతోంది.
తిరుపతి పోలింగ్పై కరోనా ఎఫెక్ట్
తిరుపతిలో ఏప్రిల్ 17న జరిగే ఉపఎన్నికపై కరోనా ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తిరుపతి ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు, కార్యకర్తలకూ కరోనా సోకింది. చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే తిరుపతి లోక్సభ నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లలో కరోనా కల్లోలం రేపుతోంది. చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే కరోనా కేసుల్లో టాప్లో ఉంది. దీంతో ఈ ప్రభావం తిరుపతి ఉపఎన్నిక ఓటింగ్పై పడటం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 15 లక్షలకు పైగా ఓట్లున్న తిరుపతి లోక్సభ స్ధానంలో పోలింగ్ శాతం కూడా ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీల్లో ఆ మేరకు ఆందోళన కనిపిస్తోంది.
చంద్రబాబుపై రాళ్ల దాడి వివాదం
తిరుపతి ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నా, పోలీసులు, ప్రభుత్వం మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. చంద్రబాబుపై రాళ్లు విసిరినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. దీని వల్ల తక్షణం ఏమీ జరగ్గపోయినా, రేపు ఎన్నికల్లో ఈ అంశం టీడీపీకి సానుభూతి తెస్తుందన్న ఆందోళన వైసీపీలోనూ కనిపిస్తోంది. అందుకే జిల్లా వాసి అయిన చంద్రబాబుపై దాడి వివాదంపై అదే జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి పదే పదే స్పందిస్తున్నారు.
వైసీపీ అభ్యర్ది గురుమూర్తి మతమార్పిడి
వైసీపీ అభ్యర్దిగా తొలిసారి రంగంలోకి దిగిన డాక్టర్ గురుమూర్తి ఎస్సీలోని మాల సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే ఆయన నామినేషన్ వేసే ముందు స్ధానికంగా ఉన్న ఓ పాస్టర్ ఆశీర్వాదం తీసుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి , తర్వాత తొలగించాలని బీజేపీ నేత సునీల్ దేవధర్ ఆరోపిస్తున్నారు. ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ సైతం వర్తించదని, ఇప్పుడు గురుమూర్తిని సైతం ఈ వ్యవహారంలో తిరుపతిలో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. స్ధానికంగా ఉన్న తిరుమల శ్రీవారిని గురుమూర్తి దర్శించుకోకపోవడాన్ని కూడా బీజేపీ తెరపైకి తెస్తోంది. ఈ వివాదంతో వైసీపీ ఓట్లను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో తెలియదు.