భగవద్గీత వర్సెస్ బైబిల్: బండి సంజయ్ తిరుపతికి వస్తే.. అరెస్ట్?: వైసీపీ ముందుజాగ్రత్త
తిరుపతి: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారంటూ వార్తలు వెల్లువెత్తుతోన్నాయి. తెలంగాణలోని సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన సారథ్యంలో బీజేపీ అద్భుత ఫలితాలను అందుకున్న నేపథ్యంలో బండి సంజయ్ ఇక తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలోనూ పాల్గొంటారనే ప్రచారం సాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నట్లు కనిపిస్తోంది.
నిమ్మగడ్డ ఆన్ ఫైర్: అమ్మఒడి అమలు ఎఫెక్ట్?: ఎన్నికల సంఘంలో ఫస్ట్ వికెట్: జేడీపై యాక్షన్
ఇదివరకు హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని.. వైఎస్సార్సీపీ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి అర్బన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బండి సంజయ్పై ఫిర్యదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఏఎస్పీ సుప్రజ కేసు నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీన నిర్వహించిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యనాలు చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి ఓటర్లు తమకు భగవద్గీత పార్టీ కావాలో.. బైబిల్ పార్టీ కావాలో.. తేల్చుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.
దీనికి సంబంధించి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలు, వీడియో క్లిప్పింగులను వారు తమ ఫిర్యాదు పత్రానికి జత చేశారు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం పేరుతో బండి సంజయ్.. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్ర పన్నారని వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ సమన్వయకుడు ఎంవీఎస్ మణి, బీసీ సెల్ కార్యదర్శి శాకం ప్రభాకర్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పుల్లయ్య, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు షఫి ఖాద్రి, వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీ రాజేంద్ర తదితరులు ఆరోపించారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ను దింపింది పార్టీ అధిష్ఠానం. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా గుర్తింపు పొందిన ఆయన.. తన దైన శైలిలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు కూడా. తిరుపతి ప్రజలందరూ హిందూ ఓటుబ్యాంకుగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పిలుపునిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక పోరాటం.. వైసీపీ-బీజేపీ మధ్య కాదని, బైబిల్-భగవద్గీత, రెండు కొండలు-ఏడుకొండల మధ్య కొనసాగుతోన్న పోరుగా అభివర్ణించడం.. ప్రచార తీవ్రతను చాటుతోంది.