తిరుపతి: పోటీపై పవన్ కల్యాణ్ ట్విస్ట్ -టికెట్ కోసమే ఢిల్లీకి రాలేదు -టార్గెట్ జగన్ -2రోజుల్లో ఫైనల్
మూడు రోజుల సుదీర్ఘ పడిగాపుల తర్వాతగానీ బీజేపీ హైకమాండ్ ను కలిసే అవకాశం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు దక్కింది. ఆలస్యానికి చింతిస్తున్నట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా గంటసేపు పవన్, నాదెండ్ల మనోహర్లతో చర్చలు జరిపారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన బరిలోకి దిగుతుందనే విషయాన్ని కరాకండిగా చెప్పేందుకే పవన్ ఢిల్లీకి వెళ్లారని పెద్ద ఎత్తున ప్రచారం సాగగా, నడ్డాతో భేటీ అనంతరం జనసేనాని మీడియాతో మాట్లాడుతూ ట్విస్టిచ్చారు..
తిరుపతి బైపోల్: నడ్డాతో పవన్ భేటీ -చంద్రబాబును కలిసిన పనబాక లక్ష్మి -29 నుంచే ప్రచారంలోకి
గ్రేటర్ త్యాగానికి ప్రతిఫలంగా..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందుకు ప్రతిఫలంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీకి జనసేనకు అవకాశం ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ కోరుతున్నట్లు జనసేన, బీజేపీ నేతలు బాహాటంగా చెప్పారు. బుధవారం ఢిల్లీలో నడ్డాతో భేటీలోనూ పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు మీడియాలో వార్తు వచ్చాయి. కానీ తాము తిరుపతి బైపోల్ కోసం ఢిల్లీకి రాలేదని నాదెండ్ల చెప్పారు. బీజేపీ చీఫ్ నడ్డా పిలుపు మేరకు వచ్చామని జనసేనాని పవన్ క్లారిటీ ఇచ్చారు.
పోటీపై కమిటీ ఏర్పాటు..
నడ్డాతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ప్రధానంగా తిరుపతి బైపోల్స్ గురించే ప్రత్యేకంగా మాట్లాడామని, ఉమ్మడి అభ్యర్థి కోసం చర్చించినట్లు ఆయన చెప్పారు. అయితే, రెండు పార్టీలు కలిసి దీనిపై(ఉమ్మడి అభ్యర్థి)పై ఓ కమిటీ వేద్దామని నడ్డా చెప్పారని, సదరు కమిటీ రిపోర్టుల తర్వాత తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉండాలా? లేక బీజేపీ అభ్యర్థి ఉండాలా? అన్నది ఖరారవుతుందని, ఇంకో రెండు రోజుల్లో ఫైనల్ నిర్ణయం తేలిపోతుందని పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేకాదు,
జగన్ పాలనలో లోపాలపై..
తిరుపతి ఉప ఎన్నిక అంశంతోపాటు ఏపీ ప్రధాన సమస్యలైన అమరావతి తరలింపు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశాలపై కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్ తెలిపారు. 60 నిమిషాలపాటు సాగిన భేటీలో.. భవిష్యత్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ-జనసేనలు కలిసి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై మాట్లాడుకున్నామని, అదే సమయంలో జగన్ సర్కారు చేస్తోన్న అవినీతి అక్రమాలు, దేవాలయాలపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యం తదితర అంశాలపైనా నడ్డాతో చర్చించినట్లు జనసేనాని చెప్పారు. రాజధాని అమరావతిలో రైతులు చేస్తున్న పోరాటానికి బీజేపీ అండగా ఉందని నడ్డా హామీ ఇచ్చినట్లు పవన్ పేర్కొన్నారు. కాగా,
తిరుపతి కోసం ఢిల్లీ రాలేదు..
పవన్ తోపాటే మీడియాతో మాట్లాడిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. నడ్డాతో తిరుపతి టికెట్ గురించే మాట్లాడానని పవన్ చెప్పగా.. నాదెండ్ల మాత్రం.. తిరుపతి ఉప ఎన్నిక కోసం ఢిల్లీ పర్యటనకు రాలేదన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసమే తాము ఢిల్లీ పర్యటన చేపట్టామని, రాజధాని అమరావతి, పోలవరం అంశాలపై నడ్డాతో చర్చించామని అన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధాని మార్చడం సరికాదని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నది జనసేన నిర్ణయమని మనోహర్ స్పష్టం చేశారు.
Recommended Video
బీజేపీ భారీ స్ట్రోక్: పవన్, జగన్కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?