టీటీడీ: కిరీటాల దొంగ దొరికాడు: కుదువకు పెట్టేశాడట
తిరుపతి: తిరుపతిలోని శ్రీగోవింద రాజస్వామి వారి ఆలయంలో మూడు కిరీటాలను చోరీ చేసిన కేసులో అసలు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడెక్కడో కాదు.. ముంబైలోని దాదర్ రైల్వేస్టేషన్ లో అతడిని తిరుపతి అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను నేరం చేసినట్లు అతను అంగీకరించినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. దాదర్ నుంచి రైలు ద్వారా అతణ్ణి తిరుపతికి తీసుకుని వస్తున్నారు. త్వరలోనే నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. మూడు కిరీటాలను ముంబైలో కుదువకు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకా హత్యలో కొత్తకోణం: గుండెపోటుతో కన్నుమూసినట్లు పుకార్లు పుట్టించింది ఆయనే: పోలీసులు
కిరిటాలు కొట్టేసి.. ముంబైకి
తిరుపతి శ్రీగోవింద రాజస్వామి వారి ఆలయం ఆవరణలోని ఉపాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన మూడు కిరీటాలు మాయమైన విషయం తెలిసిందే. ఉత్సవ మూర్తులకు అలంకరించిన మూడు కిరీటాలు చోరీకి గురైన విషయం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనపై తిరుపతి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ముందుగా-సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. సీసీటీవీలు సక్రమంగా పనిచేయకపో వడం వల్ల దర్యాప్తు ముందుకు సాగడం కష్టతరమైంది. అనంతరం ఆలయ అర్చకుల సహకారంతో కొందరు అనుమానితుల ఊహా చిత్రాలను చిత్రీకరించారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఉన్న షాపుల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో ఈ అనుమానితుల ఫొటోలను గుర్తించారు. అనంతరం అసలు నిందితుడిని నిర్ధారించారు. కిరీటాలను కొట్టేసిన వెంటనే అతను రైలులో ముంబై వెళ్లినట్లు నిర్ధారించారు.
రెండు నెలలు..పక్కా సమాచారం
నిందితుడి పేరు అకాష్ ప్రతాప్ సరోదే అని నిర్ధారించారు. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా హనుమాన్ మందిర్ జవాల్ కాందార్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తేల్చారు. అతని కోసం గాలింపు చేపట్టారు. దీనికోసం తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాదర్ రైల్వేస్టేషన్లో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని గుర్తించడానికి పోలీసులు సుమారు రెండు నెలల సుదీర్ఘ సమాయాన్ని తీసుకున్నారు. ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తున్నవారిని ఒక్కొక్కరిగా ఎంపిక చేసుకుని వారికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించారు. వారి ఫోన్ నంబర్లను కూడా సేకరించారు. ఫోన్ లోనే సంప్రదించారు. తాము వేసిన ఊహా చిత్రాలకు సీసీటీవీ ఫుటేజ్లో అనుమానితుల ఫొటో సరిపోల్చడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ముంబైలో కుదువ..
ఉత్సవ మూర్తులకు అమర్చిన మూడు కిరీటాల విలువ సుమారు 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు ఇంతకుముందే నిర్ధారించారు. వాటిని చోరీ చేసి, ముంబై వెళ్లిన ఆకాష్.. అక్కడే తనకు పాత పరిచయం ఉన్న షాపులో కుదువకు పెట్టినట్లు తేలింది. వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును తీసుకుని, స్వస్థలానికి వెళ్లారు. అప్పటి నుంచి తరచూ ముంబైకి రాకపోకలు సాగిస్తుండే వాడని స్పష్టమైంది. ఇలా రాకపోకలు సాగిస్తున్న సమయంలోనే తిరుపతి అర్బన్ పోలీసులు ఆకాష్ ను దాదర్ రైల్వే స్టేషన్ లో అరెస్టు చేశారు. త్వరలోనే అతణ్ని తిరుపతికి తీసుకుని రానున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, స్థానిక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కిరీటాలను ఎక్కడ కుదువ పెట్టాడనే విషయంపై అతని నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకుంటున్నారని, కిరీటాలతో సహా పోలీసులు తిరుపతికి వస్తారని అంటున్నారు.
సాయంత్రం పూట చోరీ..
ముంబై నుంచి తీసుకొచ్చిన వెంటనే మీడియా ముందు ప్రవేశపెడతారని పోలీసులు చెబుతున్నారు. కిరీటాల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారని చెప్పారు. ఏ ఆలయానికైనా ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. గోవిందరాజ స్వామి ఆలయంలో చోటు చేసుకున్న చోరీ ఘటన కూడా సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్యలోనేనని ఆలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. నిజానికి.. అది రద్దీ సమయం. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకునే సందర్భం. అదే సమయంలో.. ఆలయ అర్చకులు గానీ, ఇతర సిబ్బంది గానీ విధులను మారుతారు. ఆ సమయంలో చోరీ జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలను పోలీసులు చెబుతున్నారు. ఆకాష్ ను మీడియా ముందు ప్రవేశపెట్టిన తరువాత పూర్తి సమాచారం అందుతుందని అన్నారు.