బీజేపీతో తాడోపేడో: అమిత్ షాతో భేటీ: తిరుపతికి పవన్: కఠిన నిర్ణయాల దిశగా జనసేన
తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక గడువు ముంచుకొస్తోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చేనెల 6వ తేదీన తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం.. ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల వేడి రాజుకుంటోన్న కొద్దీ.. ఈ రెండు పార్టీలు ప్రచార పర్వాన్ని ముమ్మరం చేయబోతోన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ సాయంత్రం తిరుపతిలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మీ, ఇతర నేతలతో సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు.
బీజేపీ-జనసేన మధ్య తేలని పోటీ వ్యవహారం..
వైఎస్సార్సీపీ, టీడీపీలకు భిన్నమైన పరిస్థితులు భారతీయ జనతాపార్టీ, దాని మిత్రపక్షం జనసేనల్లో నెలకొని ఉంది. తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలనేది ఇంకా తేలనే లేదు. ఏ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలనేది ఖరారు కాలేదు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. బీజేపీ ఈ ఉప ఎన్నిక బరిలో దిగడం దాదాపు ఖాయమైనట్టే. తిరుపతి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఆయా ప్రాంతాల్లో బలమైన సామాజిక వర్గ నేతలతో భేటీ అవుతున్నారు.
పవన్కు దక్కని భరోసా
తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారంలో పవన్ కల్యాణ్కు బీజేపీ నుంచి ఎలాంటి భరోసా లభించట్లేదు. ఇదివరకు పవన్ కల్యాణ్.. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ఒకట్రెండు సమావేశాలు కొనసాగినప్పటికీ.. దీనిపై ఎలాంటి నిర్ణయాలు వెలువడలేదు. ఇదే విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు గానీ భరోసా రాలేదు. ఫలితంగా- ఎవరు పోటీ చేయాలనే విషయంపై గందరగోళం కొనసాగుతోనే వస్తోంది.
4న తిరుపతికి అమిత్ షా
ఈ పరిణామాల మధ్య అమిత్ షా ఈ నెల 4వ తేదీన తిరుపతికి రాబోతోన్నారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ఇందులో భాగంగా తిరుపతిని సందర్శించనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించనున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పీఎన్వీ మాధవ్, ఇతర నేతలతో భేటీ అవుతారు. తిరుపతి ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహిస్తారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. బహిరంగ సభలోనూ పాల్గొనే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
అమిత్ షాతో పవన్ భేటీ..
అదే రోజు పవన్ కల్యాణ్ కూడా తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. అభ్యర్థిని పోటీకి నిలిపే విషయంపై పవన్ కల్యాణ్.. అమిత్ షాతో తాడోపేడో తేల్చుకుంటారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నందున.. దానికి పరిహారంగా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశాన్ని తమకు కల్పించాలని ఆయన అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తారని అంటున్నారు.
2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో మద్దతుతో పోటీ చేసిన బహుజన్ సమాజ్వాది పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్ల శాతాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్తారని సమాచారం. జనసేన అభ్యర్థిని దింపడంపై అమిత్ షా ఎలాంటి హామీ ఇవ్వకపోతే.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.