గుండెపోటుతో తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ కన్నుమూత...
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ (64) బుధవారం(సెప్టెంబర్ 15) గుండెపోటుతో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడం,గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం.
1985లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దుర్గా ప్రసాద్... 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. 1985 నుంచి వరుసగా నాలుగుసార్లు గూడూరు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్లో(1996-1998) విద్యా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
ఎంపీ దుర్గా ప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుమారుడికి ఫోన్ చేసి ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దుర్గాప్రసాద్ మృతితో తిరుపతిలోని వైసీపీ కార్యకర్తలు,ఆయన సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.
ఎంపీ దుర్గాప్రసాద్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్ అనువజ్ఞులైన నాయకులు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారంటూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.