మహిళను బెల్టుతో కొట్టింది నిజమే -తిరుపతి ఎస్సై ప్రకాశ్కు వీఆర్ -కఠిన చర్యలకు డిమాండ్
టెంపుల్ సిటీ తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి (ఎంఆర్ పల్లి) పోలీస్ స్టేషన్ లో మహిళను బెల్టుతో కొట్టిన ఘటనలో ఎస్సై ప్రకాశ్ కుమార్ తప్పు తేలింది. రెండ్రోజులుగా వివాదాస్పదంగా మారిన ఈ ఘటనను తిరుపతి పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పీ సుప్రజ దర్యాప్తు చేపట్టగా..
బాధితురాలు వనితా రాణి పట్ల ఎంఆర్ పల్లి ఎస్సై ప్రకాశ్ కుమార్ దారుణంగా వ్యవహరించినట్లు నిర్దారణ అయింది. ఏఎస్పీ సుప్రజ తన నివేదికను ఎస్పీకి సమర్పించిన అనంతరం.. ఎస్సై ప్రకాశ్ ను వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు పంపుతూ ఆదేశాలు వెలువడ్డాయి. అయితే, ఎస్సైపై ఈ మాత్రం చర్యలు సరిపోవని, అరెస్టు సస్పెండ్ చేసి కేసు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతిలోని ఉప్పరపల్లిలో ఉంటూ ఆటో నడుపుకొని జీవించే వనితా వాణి ఇంట్లోకి శనివారం కొన్ని గేదెలు ప్రవేశించి గార్డెన్ ను ధ్వంసం చేయగా, గేదెల యజమానులు, ఇంటి యజమానికి గొడవ జరిగింది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకుగానూ వనితారాణి ఎంఆర్ పల్లి స్టేషన్ కు వెళ్లగా.. అప్పుడే పూజ కోసం సిద్ధమవుతోన్న ఎస్సై ప్రకాశ్ కుమార్.. నీళ్లతో శుభ్రం చేసిన స్టేషన్ ఆవరణలోకి ఎదుకొచ్చావంటూ ఆమెపై బెల్టుతో దాడి చేశాడు.
బాధితురాలు స్టేషన్ బయటే ధర్నాకు దిగడం, మీడియాలో వార్తలకు స్పందించిన పోలీసులు సదరు ఎస్సై ప్రకాశ్ పై విచారణ జరిపి వీఆర్ కు పంపడంతో వివాదం ముగిసినట్లుగా పోలీస్ శాఖ భావిస్తున్నది. కానీ ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సిందేనని బాధితురాలు, పార్టీలు పట్టుపడుతున్నాయి.