దేవాలయాల పునర్నిర్మాణం వేళ.. వైఎస్ జగన్కు రమణ దీక్షితులు కొత్త డిమాండ్
తిరుపతి: చంద్రబాబు హయాంలో కూల్చివేతలకు గురైన దేవాలయాలను పునర్నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయాల పునర్నిర్మారణం, జీర్ణోద్ధారణ కోసం ముహూర్తాన్ని కూడా నిర్ధారించింది. శుక్రవారమే పునర్నిర్మాణ పనులకు వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ దేవాదాయ, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు పూర్తి చేశాయి.
Recommended Video
ఈ పరిస్థితుల్లో మరో కొత్త డిమాండ్ తెర మీదకి వచ్చింది. కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు, ఆగమ సలహాదారు ఏవీ రమణ దీక్షితులు.. ఈ డిమాండ్ను లేవనెత్తారు. ఆలయాల పునర్నిర్మించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూనే.. మెలిక పెట్టారు. రాష్ట్రంలో ఆలయాల పునర్నిర్మాణంతో పాటు కలియుగ వైకుంఠం తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూడా పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ఆయన వైఎస్ జగన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు విజ్ఙప్తి చేశారు. వెయ్యి కాళ్ల మండపం కూడా చంద్రబాబు హయాంలోనే కూల్చివేతకు గురైందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనితోపాటు తేరుమండపాన్ని పునర్నిర్మించాలని కోరారు. ఈ రెండు నిర్మాణాలను వీలైనంత త్వరగా చేపట్టాలని కోరారు. వెయ్యి కాళ్ల మంటపం కోట్లాది మంది హిందువులు.. శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూల్చివేతలకు గురైన ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం పట్ల రమణ దీక్షితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పూనుకున్న వైఎస్ జగన్కు తిరుమల వేంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహం సమృద్ధిగా కలగాలను అకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆలయాలను పునర్నిర్మించడం అనేది ఓ చారిత్రత్మక ఘట్టమని పేర్కొన్నారు. నిర్విఘ్నంగా, నిరాటంకంగా పునర్నిర్మాణ పనులు కొనసాగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.