టీటీడీ కాదది టీడీపీ: అధికార పార్టీ పెద్దలకు బంగారుబాతులా మారిన శ్రీవారి హుండీ
తిరుపతిః పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రం రాజకీయ నిరుద్యోగులలకు ఉపాధి ఇచ్చే కల్పవృక్షంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వివాదాలు తిరుమలను చుట్టుముట్టాయి. చోరీలు సర్వ సాధరణమైపోయాయి. కలియుగ వైంకుంఠంలా భావించే తిరుమల కొండపై మందుబాబులు యథేచ్ఛగా తిరుగాడుతున్నారు. అన్యమతస్తులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నారు. ధార్మిక కార్యకలాపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విద్య, వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన శ్రీవారి హుండీ నిధులు పక్కదారి పట్టాయి. దుర్వినియోగమౌతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఛోటా, మోటా నాయకులు కూడా తిరుమలపై పెత్తనాన్ని చలాయిస్తున్నారు.
కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ధార్మిక కేంద్రం తిరుమల. అక్కడ వెలసిన శ్రీవారిని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువుగా భావిస్తారు భక్తులు. రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఆలయం కూడా అదే. సాధారణ రోజుల్లో కూడా కనీసం, కోటి రూపాయల ఆదాయాన్ని హుండీ ద్వారానే సమకూరుతుంది. టికెట్లు, ప్రసాదం, లడ్డూ విక్రయాల రూపంలో వచ్చే ఆదాయం దీనికి అదనం. వారాంతపు రోజులు, పండుగలు, బ్రహ్మోత్సవాలు, సెలవు రోజుల్లో టీటీడీకి వచ్చే ఒక్క రోజు ఆదాయం మూడు కోట్ల రూపాయల పైమాటే.
సంక్షేమానికి 65 వేల కోట్లు : 2.26 లక్షల కోట్లతో బడ్జెట్: శాఖల వారీగా కేటాయింపులు ఇలా..!
అంతటి ప్రాముఖ్యత ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం.. రాజకీయమయమైంది. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తోంది. ఆలయ పరిపాలన దారి తప్పింది. ఆర్జిత సేవా టికెట్లలో ఎన్నిసార్లు అక్రమాలు చోటు చేసుకున్నాయో లెక్కే లేదు. ఆన్లైన్ టికెట్ల విక్రయాలు, గదుల బుకింగ్లో దళారీ వ్యవస్థ తెరపైకి వచ్చింది. టీటీడీలో అన్యమత ఉద్యోగులు ప్రవేశించారు. తిరుమల కొండపైనా అన్యమతస్తులు తిరుగాడుతున్నారు. దీనికి సంబంధించిన ఉదంతాలు ఇదివరకే వెలుగు చూశాయి. అడపాదడపా మందుబాబులూ తచ్చాడుతుంటారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి తిరుమల కొండపై నమాజ్ చేస్తూ కనిపించిన ఘటన కలకలం రేపింది. కొందరు వ్యక్తులు అన్యమత గ్రంధాలు, కరపత్రాలను పంచుతూ పట్టుబడ్డ సందర్భాలు లేకపోలేదు. తిరుమలలో చోటు చేసుకున్న, చేసుకుంటున్న తప్పిదాలకు పూర్తి బాధ్యత బోర్డుదే. ఇందులో మరో మాటకు ఛాన్సే లేదు. రాజకీయ అనుయాయులకు బోర్డులో సభ్యత్వాన్ని ఇవ్వడం వల్ల వారు చెప్పిందే వేదంగా పాటించాల్సిన దుస్థితి ఏర్పడిందక్కడ.
శేఖర్ రెడ్డి ఉదంతం మనకు తెలిసిందే. చెన్నైకి చెందిన శేఖర్ రెడ్డి తెలుగుదేశం పెద్దలకు దగ్గరి వ్యక్తి. ఆయనను తీసుకొచ్చి టీటీడీ బోర్డులో కూర్చోబెట్టారు. తన ఇంట్లో వందల కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచి పెట్టిన కేసులో ఆయన అరెస్టయ్యారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తొలి రోజుల్లో.. సామాన్యులు ఏటీఎంల వద్ద బారులు తీరి నిల్చోగా.. అదే సమయంలో శేఖర్ రెడ్డి ఇంట్లో 2000 రూపాయల నోట్లు తళతళలాడుతూ కనిపించడం జనాన్ని నివ్వెరపరిచింది.
క్రైస్తవ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉండే పుట్టా సుధాకర్ యాదవ్ను టీటీడీ ఛైర్మన్ను చేశారు చంద్రబాబు నాయుడు. కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి పుట్టా. 2014 ఎన్నికల్లో టీటీడీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. టీటీడీ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు- మైదుకూరు నియోజకవర్గం పరిధిలో ఆయన ఫొటోలు.. తరచూ క్రైస్తవ సువార్త కూటముల పోస్టర్లలో కనిపించేవి. ఆ సమావేశాలకు పుట్టా సుధాకర్ యాదవ్ ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యేవారు.
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుకు పుట్టా స్వయానా వియ్యంకుడు. పుట్టా కోడలు..యనమల కుమార్తె. ఈ బంధం వల్లే.. చంద్రబాబు నాయుడు ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని భావిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడికి కులాన్ని అంటగట్టడం భావ్యం కాకపోవచ్చు. ఎందుకంటే- రాజకీయ పరంగా ఆయన అందర్నీ కలుపుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి రాజకీయ నాయకుడిని టీటీడీ ఛైర్మన్గా చేయడం సహేతుకం కాదనే భావన భక్తుల్లో ఉంది.
రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న రాయపాటి సాంబశివరావు టీటీడీ ఛైర్మన్ పదవి కోసం చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. పుట్టా కంటే ముందు టీడీపీకి చెందిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి కూడా టీటీడీ బోర్డు ఛైర్మన్గా పనిచేశారు. తిరుపతి అసెంబ్లీ టికెట్ను ఇవ్వడం కుదరక.. చదలవాడకు టీటీడీ బోర్డు ఛైర్మన్ను చేశారు చంద్రబాబు. తెలుగుదేశం గానీ, కాంగ్రెస్ గానీ అధికారంలో ఏ పార్టీ ఉన్నా టీటీడీ బోర్డు రాజకీయమయమే అవుతుంది. అది ఆనవాయితీ.
అయినప్పటికీ- ఈ సారి తలెత్తిన వివాదాలు మాత్రం అసాధారణం. టీటీడీ ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ తీసుకుంటున్న నిర్ణయాలు, బోర్డు కార్యకలాపాలను ప్రశ్నించినందుకు.. ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను ఇంటికి సాగనంపారు. వంశపారంపర్యంగా వస్తోన్న అర్చక వృత్తిని కాదని, 65 ఏళ్లకు పదవీ విరమణ అనే సరికొత్త నిబంధనను రాత్రికి రాత్రి సృష్టించి మరీ.. రమణ దీక్షితులతో బలవంతంగా పదవీ విరమణ చేయించారు. ఈ వ్యవహారం న్యాయస్థానం మెట్లు ఎక్కింది.
వందల ఏళ్ల నాటి తిరువాభరణాలు మాయమయ్యాయనే వివాదం కూడా తలెత్తింది. శ్రీవారి పోటులో తవ్వకాలు.. బయటి ప్రపంచానికి తెలియని రహస్యంగా మిగిలిపోయింది. పింక్ డైమండ్ మాయం కావడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. భక్తులు విసిరిన నాణేలు తగిలి పింక్ డైమండ్ పగిలి పోయిందంటూ టీటీడీ బోర్డు ఇచ్చిన వివరణలో ఏ మాత్రం వాస్తవం లేదని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. పింక్ డైమండ్ చోరీకి గురైందని రమణ దీక్షితులు ప్రస్తావించడం గమనార్హం.
శ్రీకోదండరామస్వామి, తిరుచానూరు పద్మావతి ఆలయాల్లో ఏళ్ల నాటి విలువైన నగలు మాయమయ్యాయి. తాజాగా- తిరుపతిలోని శ్రీగోవిందరాజ స్వామి ఆలయంలో కిరీటాలు మాయం కావడం, ఆ సమయంలో సీసీటీవీలు పని చేయకపోవడం..వంటి పరిణామాలు భక్తులకు ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయో అర్థం కాని దుస్థితి. కిరీటాల దొంగలు ఎప్పటికి దొరుకుతారు?, అసలు దొరుకుతారా? లేదా? అనేది కూడా అనుమానమే.
శ్రీవారి హుండీపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు.. ఆలయ నిర్మాణాల పేరుతో నిధులను మంజూరు చేయించుకుంటున్నారు. ఆలయ నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేసి, నిధులను రాబట్టుకుంటున్నారు. తమ సొంతానికి వాడుకుంటున్నారు. 150 కోట్ల రూపాయలతో అమరావతిలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయమే దీనికి తాజా ఉదాహరణ. అమరావతిలో తిరుమల నమూనా ఆలయాన్ని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించగా.. హుటాహుటిన 150 కోట్లను విడుదల చేసింది టీటీడీ బోర్డు.
ఎకరం ఒక్కింటికి 25 లక్షల రూపాయలు ఉన్న చోట.. 50 లక్షలను ఖర్చు చేసింది టీటీడీ. 25 ఎకరాలను వ్యయం చేసింది. ఈ కొనుగోళ్లలో శ్రీవారి నిధులు దుర్వినియోగమయ్యాయంటూ నవీన్ కుమార్రెడ్డి అనే భక్తుడు కోర్టును ఆశ్రయించగా.. అసలు విషయం బయట పడింది. దీనితో అదనంగా చెల్లించిన 12.5 కోట్ల రూపాయలు తిరిగి టీటీడీ ఖాతాలో జమచేశారు.
టీటీడీలో అధికారుల పెత్తనం కూడా ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. ఏళ్ల తరబడి, ఎలాంటి బదిలీలు లేకుండా అక్కడే తిష్ట వేసిన కొందరు అధికారులు.. నియంతలా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం వల్ల దేవాదాయ మంత్రిత్వశాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని సైతం వాళ్లు లెక్క చేయట్లేదు. దీనిపై కేఈ బహిరంగంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంతా జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం ఏనాడూ పెదవి విప్పలేదు.