టీటీడీ పాలకమండలి నిర్ణయాలు- 2937 కోట్ల బడ్జెట్ ఆమోదం-జాతీయ ప్రాణిగా ఆవు
తిరుమల తిరుపతి దేవస్థానం 2021 - 22 బడ్జెట్ ను రూ. 2937.82 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
టీటీడీ బోర్డు సమావేశం నిర్ణయాలు
ఇవాళ తిరుమల అన్నమయ్య భవనంలో సమావేశమైన టీటీడీ పాలకమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపడం, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాయడం, శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి, ఉద్యోగులకు కరోనా వ్యాక్సినే్ వేయించడం సహా పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి. వీటితో పాటు టీటీడీ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కూడా బోర్డు అనుమతి మంజూరు చేసింది.
రూ.2937 కోట్ల వార్షిక బడ్జెట్
తిరుమల, తిరుపతి దేవస్ధానం తరఫున ఏడాది పొడవునా చేపట్టే పలు కార్యక్రమాల కోసం వార్షిక బడ్జెట్గా రూ.2937 కోట్ల రూపాయలను ఆమోదిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే బర్డ్ ఆస్పత్రిలోని పాత ఓపీడీ భవనం, మొదటి అంతస్తులో శ్రీ వెంకటేశ్వర పీడియాట్రిక్ ఆస్పత్రి నిర్మాణ పనులకు రూ.9 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపారు. కొత్త ఓపీడీ భవనంలో మూడో అంతస్తు విస్తరణ పనులకు రూ.3.75 కోట్ల టెండర్లను ఆమోదించారు. ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి వాడే నెయ్యిట్యాంకుల సామర్ధ్యం 82.4 మెట్రిక్ టన్నుల నుంచి 180.4 మెట్రిక్ టన్నులకు పెంచాలని నిర్ణయించారు. దీంతో నెయ్యి నిల్వలు 6 రోజుల నుంచి 14 రోజులకు పెరగనున్నాయి. తిరుమలలో అన్ని వసతి గృహాల వద్ద విద్యుత్ మీటర్ల బిగింపు, క్రమంగా 50 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీకి మారాలని కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది.
జాతీయ ప్రాణిగా గోవు-ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలు
టీటీడీ చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వస్తున్న స్పందన నేపథ్యంలో గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని టీడీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి త్వరలో లేఖ రాయనున్నారు. అలాగే శ్రీవారి ఆర్జిత సేవలకు ఏప్రిల్ 14 నుంచి అనుమతి ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలనే నిబంధన పెట్టాలని నిర్ణయించారు. సేవకు వచ్చే మూడు రోజుల ముందే కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్ఠిఫికెట్ తీసుకురావాలని నిబంధన పెట్టనున్నారు. తిరుమలలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులందరికీ త్వరలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించారు.
అనుబంధ ఆలయాలపై
తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలోనూ తులాభారం ప్రవేశపెట్టేందుకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకురావడానికి విధివిధానాలను కూడా నిర్ణయించారు. ఇలాంటి ఆలయాలకు శ్రీవాణీ ట్రస్టు నుంచి ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించారు. టీడీడీ కళ్యాణమండపాల నిర్మాణం, లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఉన్న కళ్యాణ మండపాలు సక్రమంగా నిర్వహించి నష్టాలు తగ్గించుకోవాలని పాలకమండలి నిర్ణయించింది. టీటీడీ పరిధిలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంగా మార్చాలని నిర్ణయించారు. శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించాలని నిర్ణయించారు. త్వరలో ముంబై, జమ్మూలోని శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్టు టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయంలో వారు ఏది కోరితే అది నిర్మించాలని బోర్డు నిర్ణయించింది.